జగన్ ఏదైనా డీల్ చేస్తే అలా ఉంటుంది మరి!

Jagan Adani Issue

ఆక్రమాస్తుల కేసులలో పలువురు ఐఏస్ అధికారులు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వాములుగా చేసిన ఘనత ఖచ్చితంగా జగన్, విజయసాయి రెడ్డిలదే. వారిలో కొంతమంది జగన్, విజయసాయిలతో పాటు చంచల్ గూడ జైలుకి వెళ్ళివస్తే మిగిలిన వారందరూ నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఆ కేసులు, వివేకా హత్య కేసుల విచారణ వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టులోనే మళ్ళీ ఏవో పీటీషన్లు వేయిస్తూ, దాని చేతే విచారణ జరిపిస్తూ, వాయిదాలు వేయిస్తుండటం చూస్తే మామూలు తెలివితేటలు కావని అర్దమవుతుంది.

ADVERTISEMENT

న్యాయశాస్త్ర కోర్సులలో ఇవన్నీ పాట్యాంశాలుగా చేర్చితే, న్యాయ శాస్త్రానికి మించినవి బయట చాలానే ఉన్నాయనే విషయం విద్యార్ధులకు అర్దం అవుతుంది.

తాజాగా ఆదానీ-జగన్ విద్యుత్ కొనుగోలు కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగు ముందుకు, వెనక్కుగానీ వేయలేని పరిస్థితి కల్పించారంటే జగన్ గొప్పదనం అర్ధం చేసుకోవచ్చు.

ఈ వ్యవహారంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “నేను అందరిలా తొందరపడి మాట్లాడలేను. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాక మాట్లాడుతాను. విద్యుత్ కొనుగోలుకి జగన్ చేసుకున్న ఒప్పందంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాను.

ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. కనుక ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని వలన పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం వలన ప్రజలపై అదనపు భారం పడకూడదు. కనుక అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకనే తగిన నిర్ణయం తీసుకుంటాము,” అని అన్నారు.

ఈ వ్యవహారంలో ఆదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారని ఆధారాలు కనిపిస్తున్నాయి. కనుక వాటిని ప్రభుత్వం సేకరించగలిగితే జగన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు. నేరం నిరూపించగలిగితే ఆక్రమాస్తుల కేసుకి మించిన కేసు అవుతుందిది.

కానీ ఈ వ్యవహారంలో అదానీ ఉన్నారు. అనేక ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామిక చిక్కు ముడులు కూడా ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు చేతికి జగన్ చిక్కిన్నట్లే కనిపిస్తున్నా టచ్ చేయడం కూడా కష్టమేనని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు స్పందనే ఇందుకు నిదర్శనం. కనుక జగన్ ఏదైనా డీల్ చేస్తే అలా ఉంటుంది మరి!

ADVERTISEMENT
Latest Stories