జగన్-విజయమ్మ, షర్మిల మద్య ఆస్తుల పేచీలు వారి కుటుంబ వ్యవహారాలే. కానీ వారిరువురూ మీడియా ద్వారా వాటి గురించి ప్రజలతో మాట్లాడుతున్నారు కనుక వారి సమస్య ‘ప్రజాసమస్య’ గా మారిపోయింది. వాటి గురించి మాట్లాడుతూ వారే రాజకీయాల ప్రస్తావన కూడా చేస్తుండటంతో వారి కీచులాటలలో రాజకీయాలు పాలు, నీళ్ళలా కలిసిపోయాయి.
తిరుపతి కల్తీ నెయ్యిలో కూరుకుపోయి బయటపడిన జగన్ బుద్దిగా శవ రాజకీయాలు చేసుకుంటే నేడు వారి కీచులాటల గురించి ఎవరికీ తెలిసి ఉండేది కాదు. ఎవరూ మాట్లాడేవారూ కారు. కానీ జగన్ కేసు వేసి, తల్లికి, చెల్లికి నోటీసులు పంపించి ఈ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటుంటే, మా కుటుంబ వ్యవహారాలతో మీకేం పని? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదివరకు షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అని గర్వంగా చెప్పుకునేవారు. ఇప్పుడు వైసీపి మీడియా, ఆ పార్టీ నేతలందరూ కలిసి ‘ఆమె చంద్రబాబు నాయుడు వదిలిన బాణం’ అని గట్టిగా వాదిస్తున్నారు. అసలు ఎపిసోడ్ మొదలుపెట్టిందే జగన్ అయితే మద్యలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు?
ఇదివరకు జగన్ ఆమెను తన ప్రత్యర్ధుల మీదకు బాణంలా సందించినప్పుడు తప్పు కానప్పుడు, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆమెను బాణంలా జగన్ మీద సందిస్తే తప్పేమిటి? వీలైతే ఆ బాణాన్ని ఎదుర్కోవాలి కానీ ఎవరినో నిందించడం చాటకానితనం కాదా?
అయినా సొంత చెల్లిని, తల్లిని ఈవిదంగా క్షోభ పెట్టడమే కాకుండా, వారిపై తన పార్టీ నేతలందరి చేత మూకుమ్మడి దాడి చేయించడం, సొంత మీడియాలో వారి గురించి దుష్ప్రచారం చేయించడం సబబేనా? ఏ కొడుకు, ఏ అన్న అయినా ఇలా సొంతవాళ్ళ మీదకి ఇతరులను ఉసిగొల్పుతారా?సొంత చెల్లితో ఈవిదంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోతోందని మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
ఈవిదంగా వరుసగా చేయకూడని తప్పులన్నీ చేస్తూ, జగన్ అతి మంచితనమే ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతోందని ధర్మాత్ముడిగా అభివర్ణించుకోవడం, ధర్మపన్నాలు వల్లిస్తుండటం, చంద్రబాబు నాయుడుని నిందించడాన్ని ఏమనుకోవాలి?






