జగన్ వ్యూహాలు పైకి చాలా పిచ్చివిగా, తల తిక్కవిగా కనిపిస్తాయి. కానీ నిశితంగా గమనిస్తే వాటి పరామర్ధం వేరేగా ఉంటుందని, వాటితో అది నేరవేరుతోందని అర్ధమవుతుంది.
జగన్ హటాత్తుగా ‘మావిగన్’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదట వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. కానీ దాని పరమార్ధం వివరించిన తర్వాత అందరూ జోరుగా మావిగన్ పాట పాడుతున్నారు. ఎందువల్ల? అని కూటమి నేతలు ఆలోచించారో లేదో?
ఇంతకీ మావిగన్తో జగన్ ఏం సాధించాలనుకున్నారు? మావిగన్ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెపుతున్నారా? కానే కాదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దు. పెడితే మీరే నష్టపోతారని పారిశ్రామికవేత్తలకు, ఐటి కంపెనీలను హెచ్చరించడానికే జగన్ మావిగన్ ప్రకటించారని ఏబీ వెంకటేశ్వరరావు వాదన సహేతుకమినదే.
అమరావతిలో జోరుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. వాటి గురించి రోజూ మీడియాలో వచ్చే వార్తలు చూసి ప్రజలు ప్రభావితమవుతారు. తాజాగా అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలు చూసి రాష్ట్రంలో నిరుద్యోగులు, ఐటి నిపుణులు చాలా సంతోషిస్తున్నారు.
అలాగే దేశంలో ఇతర రాష్ట్రాలు, అక్కడి ప్రజలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. దీని వలన సిఎం చంద్రబాబు నాయుడు పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
అమరావతిలో క్వాంటం వ్యాలీ, క్వాంటం కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటైతే జాతీయ, అంతర్జాతీయ ఐటి కంపెనీలకు సిఎం చంద్రబాబు నాయుడు సమర్ధత, అమరావతిపై నమ్మకం మరింత బలపడుతుంది. కనుక మరిన్ని ఐటి కంపెనీలు అమరావతికి తరలివచ్చే అవకాశం ఉంటుంది.
జోరుగా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులు చూసి చాలా సంతోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతికి ఐటి కంపెనీలు కూడా తరలివస్తాయంటే మరింత సంతోషిస్తారు.
కనుక అమరావతి మీద నుంచి అందరి దృష్టి మళ్ళించడానికే అక్కడ జరగరానిదేదో జరిగిపోతోందని వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయితే దీనికి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి.
కనుక వాస్కోడిగామా భారత్కు సముద్రమార్గం కనిపెట్టినట్లుగా జగన్ తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని మావిగన్ కనిపెట్టి ప్రకటించారు.
కానీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నిర్దాక్షిణ్యంగా పాడుబెట్టేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిన వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ అంటూ దుష్ప్రచారం చేస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి ఓ అంతర్జాతీయ స్థాయి రాజధాని అనే బ్రాండ్ ఇమేజ్ సృష్టించాలని పట్టుదలగా ప్రయత్నిస్తుంటే, జగన్ కూడా అంతే పట్టుదలగా అమరావతి ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.
ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ మావిగన్తో నవ్వులపాలవుతున్నా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి వలన సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఆరాటపడుతున్నారు. ఇదెలా ఉందంటే నాది ఓ కన్ను పోయినా పర్వాలేదు. ఎదుటవాడివి రెండు కళ్ళూ పోవాలని కోరుకున్నట్లుంది. ఇలాంటి రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఉంటారా? అనిపిస్తుంది వైసీపీ మావిగన్ పాట వింటుంటే!
వైసీపీ అదృష్టమేమిటంటే, కూటమి ప్రభుత్వంలో ఒక్క మంత్రి నారాయణ తప్ప ఏ ఒక్కరూ అమరావతి గురించి ఒక్క ముక్క మాట్లాడరు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలు లేదా యూట్యూబర్లు పోస్ట్ చేసే వీడియోలు చూసి ప్రజలు తెలుసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అమరావతిలో పర్యటించి ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలనుకోరు. కూటమి ప్రభుత్వంలోనే ఎవరికీ అమరావతిపై ఆసక్తి లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటువైపు నుంచి ఇంత అలసత్వం, ఇంత నిశబ్ధం ఉన్నప్పుడు, ఈ అవకాశాన్ని వైసీపీ వినియోగించుకోకుండా ఉండదు కదా?
కనుక మావిగన్ శబ్దాలలో అమరావతి వినపడటం లేదు. వినపడకపోతే నష్టం ఏమీ లేదని కూటమి నేతలు అనుకోవచ్చు. కానీ వైసీపీ నేతలు మావిగన్ ఆటపాటలతో జనాలని మెప్పిస్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదని తెలుసుకుంటే మంచిది.




