త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలకు వైసీపి రెండో జాబితా విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ జాబితాని విడుదల చేస్తూ వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి 27 మంది నియోజకవర్గం ఇన్చార్జిలను ఖరారు చేసిన్నట్లు తెలిపారు.
వైసీపిలో సీనియర్ల అభ్యర్ధన మేరకు ఈసారి శాసనసభ ఎన్నికలలో వారి పుత్రరత్నాలకు జగన్ అవకాశం కల్పించారు. కానీ మొదటిసారి బ్యాటింగ్ చేయబోతున్న వారి టార్గెట్ మాత్రం పెద్దదే. అందరూ కలిసి 175 స్కోర్ సాధించాల్సి ఉంటుంది.
ఊహించిన్నట్లే అశ్లీల వీడియోతో పార్టీ పరువు తీసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని పక్కన పెట్టి ఆయన స్థానంలో జోలదరాశి శాంతకి లోక్సభ అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. ఆ ఒకే ఒక్క వీడియోతో ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ ఒక్క వీడియో వలననే ఇప్పుడు ఆయన టికెట్ కూడా పోగొట్టుకొన్నారు. ఆనాడు ఆయనపై టిడిపి ఆరోపణలు చేస్తే వైసీపి కొట్టిపడేసింది. కానీ ఇప్పుడు ఆయనను పక్కన పెట్టడంతో టిడిపి ఆరోపణలు నిజమే అని ధృవీకరించిన్నట్లయింది.
అనంతపురం ఎంపీ అభ్యర్ధిగా మాలగుండ్ల శంకర నారాయణ, అరకు ఎంపీ అభ్యర్ధిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిలను జగన్ ఖరారు చేశారు.
శాసనసభకు పోటీ చేయాలని ఉబలాటపడుతున్న ప్రముఖ సినీ హాస్యనటుడు అలీకి గుంటూరు ఈస్ట్ నుంచి జగన్ అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ రెండో జాబితాలో ఆయన పేరు లేదు.





