మనిషికి ‘ఆశ’ ఉండడం సహజమే గానీ, ‘అత్యాశ’ అనర్ధాలకే దారి తీస్తుందంటారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరు చూస్తుంటే… అత్యాశకు ‘బ్రాండ్ అంబాసిడర్’ మాదిరి వ్యవహరిస్తున్నట్లుగా కనపడుతోంది. మరికొద్ది నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందని, ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రిని, అప్పటి నుండి మన రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుందని, సదరు సంగతులన్నీ తనకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడంటూ మొన్నటివరకు ఊదరగొట్టిన జగన్, ఇటీవల ఆ వ్యాఖ్యలను కాస్త నియత్రించగలిగారు.
ప్రభుత్వం పడిపోతుందన్న మాట పక్కనపెడితే, తన పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరుతుంటే… తన పార్టీ ఉంటుందో, పడిపోతుందో అనుకున్నారేమో గానీ… తానే ముఖ్యమంత్రి అనే మాటలను తగ్గించారు. దీంతో జగన్ కూడా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారేమోననే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమయ్యింది. అయితే ఉన్నట్లుండి మళ్ళీ మచిలీపట్టణంలో జరిగిన సభలో మరొకసారి తన ‘అత్యాశ’ను బయట పెట్టుకున్నారు. తమ బాధలను, వ్యధలను ప్రతిపక్ష నేతకు చెప్పుకుందామనే ‘ఆశ’తో ప్రజలు ఉంటే, జగన్ వెళ్లి తన ‘అత్యాశ’ను ప్రజలకు చెప్పుకున్నట్లయ్యింది.
“దేవుడు దయ తలిస్తే వచ్చే సంవత్సరంలోనే ఎన్నికలు రావచ్చని” తన మనసులో ఉన్న అభిలాషను జగన్ వ్యక్తపరచడం ప్రజలకు విస్మయాన్ని కలిగించింది. అధికారం కావాలనే తలంపు రాజకీయాల్లో సర్వసాధారణమే గానీ, అధికారమే కావాలన్న దాహం మాత్రం… పెద్దలు చెప్పినట్లు “విపరీత బుద్ధులే వినాశకాలకు దారి తీస్తాయన్న” నీతి సూక్తుని గుర్తుకు తెస్తుంది. దీనికి తోడు ప్రజలలో అసత్యమైన ప్రచారం చేయడం మరింత శోచనీయం. ప్రభుత్వాలు ప్రస్తుతం తీసుకున్న భూములను తానూ అధికారంలోకి వస్తే తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం, అమలుకు సాధ్యం కాని అంశం.
ఇలాంటి తప్పుడు భావనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి, తద్వారా వారిని ఉద్వేగపరిచి, రాజకీయ లబ్ధిని ఆశించడం ఒక ముఖ్యమంత్రి కావాలన్న నాయకుడి లక్షణం కాదు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంపై నిరంతరం పోరాడాల్సింది పోయి, ఏదో రెండు, మూడు నెలలకోసారి ఏదొక పర్యటన చేసి, ప్రభుత్వంపై విమర్శలు చేసి, తానూ ముఖ్యమంత్రిని అయిపోతాను, మీ కష్టాలు తీరిపోతాయి అని చెప్పడం… బహుశా ఏపీ రాజకీయాల్లో ఇదే ప్రప్రధమం అని చెప్పకతప్పదు. గతంలో చాలామంది సిఎంలు అయ్యారు గానీ, ఎవ్వరూ నేనే ముఖ్యమంత్రిని అయిపోతాను అని వారికి వారుగా ప్రకటించుకోలేదు. మరి ఇదే స్పెషాలిటీ అనుకుంటున్నారేమో..!



