గత టిడిపి ప్రభుత్వం ఎంతో కష్టపడి రైతులను ఒప్పించి రాజధాని కోసం భూములను సేకరించింది. మరెంతో వ్యయప్రయాసలకోర్చి అమరావతిలో అనేక భవనాలు నిర్మించింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి అమరావతి ఓ శ్మశానమని, దానిలో ఎవరైనా రాజధాని కట్టుకొంటారా? అని ప్రశ్నిస్తూ ఎక్కడి పనులను అక్కడ నిలిపివేశారు. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను పాడుబెట్టేసి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన అమరావతిని నిజంగానే శ్మశానంగా మార్చేశారు. కానీ నేటికీ ఆయన అదే శ్మశానంలో చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలో కూర్చోనే పరిపాలన చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మించకపోయినా ప్రజలు బాధపడ్డారే తప్ప ఏమీ చేయలేకపోయారు. కానీ తమ ఆకాంక్షలకు ప్రతిరూపమైన అమరావతిలో భూములు అమ్ముకోవడానికి, భవనాలను లీజుకి ఇచ్చేందుకు సిద్దపడుతుండటం చూసి ఆంధ్ర ప్రజలందరూ మౌనంగా అక్రోశిస్తున్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని ప్రజలు భావిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మాజీ సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “అమరావతిని శ్మశానమన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే శ్మశానంలో భూములు అమ్ముకొనేందుకు సిద్దమవుతున్నాడు. మూడేళ్ళుగా అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టని జగన్, అక్కడ ఉద్యోగుల కోసం మా ప్రభుత్వం కట్టిన ఇళ్ళను లీజుకిచ్చేయాలనుకొంటున్నాడు. అమరావతిలో భూములు అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి నైతిక హక్కు లేదు.
అమరావతిని నిర్మించే ఉద్దేశ్యం ఆయనకు లేదు కనుకనే ఈవిదంగా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఆత్మకూరు ఉపఎన్నికలో కనిపించింది. టిడిపి పోటీ చేయనప్పటికీ వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. టిడిపి పోటీలో లేనప్పుడే వైసీపీ ఎంత డబ్బులు పంచినా, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కట్టకట్టుకొని ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేసినా వైసీపీకి గతంలో కంటే కేవలం 10 వేల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందనేందుకు ఇదే తాజా నిదర్శనం.
సంక్షేమ పధకాలు ఇచ్చినట్లే ఇచ్చి నిబందనల పేరుతో కోతలు విధించడం, ఆ పధకాల భారాన్ని మళ్ళీ ప్రజల నెత్తినే రుద్దుతూ, అన్ని ఛార్జీలు పెంచేసి రకరకాల పేర్లతో ప్రజలను చావబాడుతున్నారు. చివరికి ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛను భారం తగ్గించుకొనేందుకు వయోపరిమితిని 35 నుంచి 50 ఏళ్ళకు పెంచేసింది జగన్ ప్రభుత్వం. కేవలం మూడేళ్ళలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎన్నడూ కోలుకోలేని స్థాయికి దిగజార్చింది జగన్ ప్రభుత్వం. అందుకే ఏడాదికి కేవలం రూ.8-10 కోట్లు ఆదాయం కోసం అమరావతిలో భవనాలను లీజుకి ఇచ్చుకొనే దుస్థితికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం,” అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చొప్పుకొనే స్థాయిలో రాజధాని అమరావతిని నిర్మించాలనుకొంటే, దానిని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించేసి చివరికి అదనపు ఆదాయం కోసం భూములు అమ్మేసుకొంటూ, భవనాలు లీజుకి ఇచ్చుకొంటుండటం చూసి చంద్రబాబు నాయుడు ఆవేదన చెందడం సహజమే!



