కృష్ణానది పవిత్ర సంగమం వద్ద జరిగిన ప్రమాదం తర్వాత ఏపీ అసెంబ్లీ అంశం హైలైట్ అయ్యింది. ఈ తరుణంలో ప్రతిపక్షం వైసీపీ గనుక అసెంబ్లీలో ఉంటే, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు వేసేది అంటూ “జగన్ మీడియా అండ్ కో” భారీ కధనాలు ప్రచురితం చేస్తోంది. ఒకవేళ అసెంబ్లీని బాయ్ కాట్ చేయకుండా ఉండి ఉంటే, నిజంగా జగన్ కు అంత సీన్ ఉండేదా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే అన్న సమాధానమే లభిస్తుంది.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు దోహదం చేయడం ప్రతిపక్ష విధి నిర్వహణ. కానీ ఈ మూడున్నర్రేళ్ళల్లో జగన్ ఏనాడూ ఆ కార్యాన్ని విజయవంతంగా నిర్వహించలేదు. ఒకవేళ ఈ ప్రమాదం సమయంలో వైసీపీ అసెంబ్లీలో పాల్గొన్నా ప్రజలకు అయితే పెద్దగా ప్రయోజనం అయితే చేకూరేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మూడేళ్ళల్లో జగన్ కున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి.
ఓ నాలుగైదు సినిమా డైలాగ్ లు కొట్టేసి, వైసీపీ నేతలు స్పీకర్ ను చుట్టుముట్టేసి, కాగితాలు చించేయడం తదితర సంఘటనలు నమోదై ఉండేయి తప్ప, ఇంతకుమించి ప్రతిపక్ష పార్టీ బాధితులకు ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుంది అంటే… అది ఓ కలగానే భావించాల్సి ఉంటుంది. అధికారులు విఫలమయ్యారు అంటూ సాక్షి మీడియా గొంతెత్తిన వైనానికి, బోటు వెళ్ళడానికి ముందు ఓ అధికారి చేసిన వాగ్వివాదం బయటకు రావడంతో, ప్రస్తుతం ‘జగన్ మీడియా అండ్ కో’ మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి నెలకొంది.


