ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 3000 కిలోమీటర్ల పాదయాత్ర మధ్యలో ఉన్నారు. ప్రస్తుతం కర్నూల్ లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్ర తన తండ్రి మాదిరిగా తనని కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందని ఆయన గట్టి నమ్మకం. పనిలో పనిగా ఆయన ప్రజల పై వరాల జల్లు కురిపిస్తున్నారు.
“పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంజినీరింగ్, మెడిసిన్ను ఉచితంగా చదివిస్తాం. హాస్టల్ ఫీజు కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.2వేలకు పెంచుతాం. పెన్షన్దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం’’ అని జగన్ వారాలు కురిపించారు.
పనిలోపనిగా సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, 2019లో అధికారంలోకి వస్తే 2024 లోగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి ఆ తరువాత వచ్ఛే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం అని చెప్పుకొస్తున్నారు ఆయన. అదే సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, అధికారంలోకి రావడానికి చంద్రబాబు అడ్డమైన హామీలిచ్చారని జగన్ దుయ్యబట్టారు.
ఒకప్పుడు అలవికాని హామీలు ఇవ్వను అని చెప్పుకొచ్చిన జగన్ ఇప్పుడు ఇలాంటి హామీలు ఎలా ఇస్తున్నారా అని సొంత పార్టీ వారే ఆశ్చర్యపోతున్నారు. అయితే 2019 ఎన్నికలు తమకు జీవన్మరణ సమస్య అని, మిగతా విషయాలు పవర్ లోకి వచ్చాక చూసుకోవచ్చని వారు సర్ది చెప్పుకుంటున్నారు.



