ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్నటువంటి హైకోర్టు విభజన చేయాలంటూ కేసీఆర్ సర్కార్ తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే ప్రస్తుతం హైకోర్టును ఎక్కడ నిర్మించాలనే దానిపై ఏపీ సర్కార్ కు స్పష్టత లేకపోవడంతో చంద్రబాబు సర్కార్ దీనికి మద్దతు పలకడం లేదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ఏపీలో ప్రతిపక్షం ఎదురు చూస్తున్న తరుణంలో హైకోర్టు ప్రదేశాన్ని ప్రకటిస్తే… అదొక రాజకీయ రంగు పులుముకుంటుందనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ సైలెన్స్ పాటిస్తోంది.
అయితే, ఈ హైకోర్టు విభజనలో తాజాగా వెలుగు చూస్తున్న మరొక అంశం ఏమిటంటే… జగన్ కేసులకు, హైకోర్టు విభజనకు సంబంధం ఉన్నట్లుగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు విభజన జరిగితే ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల నుండి జగన్ తప్పించుకుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనకు ముందుకు రావడం లేదని, దీనికి ప్రధాని మోడీ కూడా మద్దతు తెలుపుతున్నారని, వీరిద్దరి వలనే హైకోర్టు విభజన ఆలస్యమవుతోందని వినోద్ కుమార్ ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు.
అయితే హైకోర్టు విభజన వలన నిజంగానే జగన్ కు లాభం చేకూరితే అందుకు టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు పట్టుబడుతున్నట్లు? అనే ప్రశ్న తలెత్తుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – వైసీపీ అధినేత జగన్ ల మధ్య ఉన్న సాన్నిహిత్య బంధం అందరికీ తెలిసినదే. ఇటీవల వైయస్ రాజశేఖర్ రెడ్డిపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ విరుచుకుపడినా, జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. అంత సాన్నిహిత్యం ఉండడం వలనే… హైకోర్టు విభజనకు కేసీఆర్ సర్కార్ పై జగన్ ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అంటే హైకోర్టు విభజనకు, జగన్ కేసులకు నిజంగానే సంబంధం ఉందా? అందుకనే చంద్రబాబు సర్కార్ హైకోర్టు విభజన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి గానీ… రాష్ట్ర విభజన సమయంలోనూ ఈ ఇద్దరూ నాయకులు పరోక్షంగా సహకారం అందించుకున్న విషయం కాలక్రమేణా వెలుగు చూసిన విషయం తెలిసిందే.



