అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే నిజాన్ని ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు అమరావతిని వ్యతిరేకించిన జగన్ కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు నొచ్చుకుంటారని కొంత తగ్గారు. అయితే ఇప్పుడు మళ్ళీ అమరావతిపై ఉన్న వ్యతిరేకతను దాచుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సాగుతున్న ఆయన పాదయాత్రలో నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అవకాశం ఉన్న జిల్లాలోని దొనకొండ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేసిందని జగన్ ఆరోపించారు. దొనకొండ ప్రాంతంలో 50వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. అందువలన అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ సిఫార్సు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు బుట్టదాఖలు చేశారని విమర్శించారు.
మరో కొన్ని రోజులలో గుంటూరు జిల్లాలో ప్రవేశించబోతున్న ఆయన మళ్ళీ అదే మాట చెప్పగలరా? విభజనకు ముందు, దొనకొండ రాజధాని అవుతుంది అని, కాంగ్రెస్, జగన్ బ్యాచ్ మొత్తం అక్కడ భూములు విరివిగా కొన్నారు. వాటికోసమే జగన్ దొనకొండ పాత పడుతున్నారు అనే విమర్శ ఉంది. దానిని నిజం చేసే పనిలో ఉన్నట్టున్నారు ఆయన.
అమరావతిని వ్యతిరేకిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలలో పార్టీ పరిస్థితి మొత్తానికి చెడుతుంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి టైములో ఇలాంటి వాగుడు మొదటికే మోసం చేస్తుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు. అయితే ఎప్పటిలానే అధినేతకు తమ గోడు చెప్పుకోలేక, చెప్పుకున్నా వినే పరిస్థితి లేకపోవడంతో వారిలో వారే మదనపడుతున్నారు.



