పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. వాటిలో నామమాత్ర లేదా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకి భూములు కేటాయిస్తుంటాయి. సరిగ్గా ఇదే అనేక లొసుగులకు కారణం అవుతోంది.
అదెలాగో చూద్దాం. ప్రస్తుతం జగన్-షర్మిల మద్య ఆస్తుల పంపకాల గొడవలలో నలుగుతున్న పేరు ‘సరస్వతి పవర్ కంపెనీ’ కూడా ఒకటి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే దీనికి లైన్ క్లియర్ చేశారు. వడ్డించేవాడు మనవాడు అయితే అన్నట్లు సరస్వతి పవర్ కంపెనీకి గుంటూరు జిల్లాలో తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ఐదో పదో కాదు… ఏకంగా 1600 ఎకరాలు కేటాయించేశారు.
కానీ నేటికీ అంటే… 14 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ కంపెనీ ఏర్పాటు చేయలేదు. కానీ వేలకోట్లు విలువైన భూములు జగన్ చేతికి దక్కాయి. ఇప్పుడు ఆ లేని కంపెనీలో వాటాల కోసమే అన్నా చెల్లీ కీచులాడుకుంటున్నారు.
అంటే పరిశ్రమలు లేదా ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు దక్కించుకొని, ఏవీ పెట్టకుండాననే వాటి విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగితే లాభపడతారన్న మాట!
ఇప్పుడు అన్నాచెల్లెలు ‘సరస్వతి పవర్ కంపెనీ’ కోసం కీచులాడుకోవడంతో ఈ వ్యవహారం మళ్ళీ బయటకు పొక్కింది. ఏకంగా 1600 ఎకరాలు అంటే దానిలో ప్రభుత్వ, అటవీ భూములు, ప్రైవేట్ భూములు చాలా భారీగా ఉందవచ్చు.
కనుక ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ భూములపై విచారణకు ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు దాచేపల్లి డెప్యూటీ రేంజ్ అధికారి విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు దాచేపల్లి, మాచవరం మండలాల్లోని తంగెడ, చెన్నాయపాలెం గ్రామాలలో పర్యటించి అటవీ భూములను గుర్తించే పని మొదలుపెట్టారు. త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తామని చెప్పారు.




