వైసీపి అధినేత హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.
“ప్రజాతీర్పుని మరో ఎన్నికలు గందరగోళపరిచాయి. ఈవీఎంల పనితీరుపై కోర్టులలో కేసులు పెండింగులో ఉన్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లేవు. మనవంటి ప్రజాస్వామ్యదేశంలో ప్రజాస్వామ్యం ధృఢంగా ఉండాలి. అందుకోసం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం చాలా అవసరం.
అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించుకుంటున్నాయి. కనుక మనం కూడా మళ్ళీ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియని చేపట్టి ఓటర్లకు నమ్మకం కల్పించాల్సి ఉంది.
కనుక పాలకులు అందరూ దీనికోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,” అని జగన్ ట్వీట్ సారాంశం. ఆయన జాతీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలను ట్యాగ్ చేస్తూ ఈ సందేశం పెట్టారు.
హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం జగన్కి చాలా ఆశ్చర్యం కలిగించిందని, అది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందని జగన్ అనుమానం వ్యక్తం చేసిన్నట్లు అర్దమవుతోంది. కనుక జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముందుగా స్పందించాల్సింది బీజేపీయే.
2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ టిడిపి గెలుస్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ ఓడిపోయారు.
అదేవిదంగా 2024 ఎన్నికలలో మళ్ళీ వైసీపి గెలుస్తుందని జగన్ అనుకున్నారు. కానీ ఓడిపోయారు.
2019లో భారీ మెజార్టీతో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల వలననే గెలిచానని జగన్ చెప్పుకోలేదు. ప్రజలు తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకున్నారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంలని నిందించలేదు.
అదే జగన్ 2024 ఎన్నికలలో ఓడిపోగానే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వలననే తాము ఓడిపోయామని వాదించడం మొదలుపెట్టారు. అంటే తాము గెలిస్తే ఈవీఎంలు ఓకే కానీ ఓడిపోతే ఈవీఎంలు నాట్ ఓకే అన్నమాట!
ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాల గురించి జగన్ ఈవిదంగా ట్వీట్ చేయడం చూస్తే, నేటికీ ఆయనకి తాను చేసిన తప్పులు, పాపాలు, లోపాల వల్లనే ఎన్నికలలో ఓడిపోయామని భావించడం లేదని స్పష్టమవుతోంది.
తన గెలుపుని తనకే ఆపాదించుకునే జగన్, తన ఓటమిని మాత్రం చంద్రబాబు నాయుడుకి, ఈవీఎంలకి ఆపాదిస్తుండటం విశేషం.
అయితే ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహిస్తే, ఎన్నికలలో ఎటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరుగవని జగన్ చెప్పగలరా?




