జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలతో విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల విలీనంతో చాలా గందరగోళం సృష్టించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు బదిలీలు, హేతుబద్దీకరణ పేరుతో తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు 8 ఏళ్ళు సర్వీసు పూర్తయినవారిని మాత్రమే ప్రభుత్వం బదిలీ చేసేది కానీ ఇప్పుడు 5 ఏళ్ళకే బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్దం అవుతుండటంపై ఉపాద్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరుచుకొని తరగతులు ప్రారంభం అయిన ఈ సమయంలో ఉపాధ్యాయులను బదిలీ చేస్తే పిల్లల చదువులు దెబ్బ తింటాయని విద్యార్థులు తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులను తగ్గించే ప్రయత్నం చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. గత ఏడాది కృష్ణా జిల్లాలో 48,000 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరగా ఈ ఏడాది జూలై 1వ తేదీ వరకు 27,000 మంది మాత్రమే చేరారు. కనుక విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులనే విధానం చేపడితే అనేక మంది ఉపాధ్యాయులను తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చని, కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలా భారం తగ్గించుకొనేందుకు విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఇటువంటి ప్రయోగాలు చేస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నష్టపోతారని, విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు బి.లంకేశ్వరరావు, బి.కనకారావు అన్నారు.



