అక్క చెల్లెమ్మలకు ఆస్తి ఇచ్చారట… మరి సొంత చెల్లికి?

YS Vijayamma YS Sharmila YS Jagan

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలస్‌లో బటన్ నొక్కి మహిళలకు పావలా వడ్డీ రుణాల రీయింబర్స్‌మెంట్ కింద రూ.46.9 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి లబ్ధిదారులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతీ అక్కాచెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నాము. వాటి వడ్డీని కూడా మేమే రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాము.

ఇల్లులేని ప్రతీ అక్కాచెల్లెమ్మలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాము. ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక, ఆర్ధిక సాయం అందిస్తున్నాము. అన్నీ కలుపుకుంటే ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు విలువచేసే ఆస్తులు సమకూర్చి ఇచ్చాము.

ADVERTISEMENT

రాష్ట్రంలోఅక్కాచెల్లెమ్మలందరికీ తోడ్పడగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాగే ప్రతీ మహిళకు తోడ్పడుతూనే ఉంటాను,” అంటూ జగన్‌ ఇంకా చాలా లెక్కలే చెప్పుకున్నారు.

రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సాయపడటం చాలా మంచిదే. అయితే జగన్మోహన్‌ రెడ్డి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఎందుకు ఆస్తులు పంచి ఇవ్వలేదు?తల్లిని పార్టీలో నుంచి ఎందుకు బయటకు పంపించేశారు? మరో చెల్లి సునీతారెడ్డి తన తండ్రి వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని దాదాపు 5 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ఆమెకు తోడ్పడకపోగా ఎందుకు ముప్పతిప్పలు పెడుతున్నారు?అనే సందేహాలు కలుగక మానవు.

రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు జగన్‌ తన ఆస్తిలో వాటాలు పంచిఇవ్వడం లేదు. ఆయన జేబులో నుంచి పైసా ఇవ్వక్కర లేదు. అంతా ప్రజాధనంలో నుంచే తీసి ఇస్తుంటారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అప్పులు చేసి తెచ్చి ఇస్తున్నారు. కానీ వైఎస్ షర్మిలకు పావలా వడ్డీ రుణం, 50 గజాల స్థలం, దానిలో ఇల్లు అవసరమే లేదు. ఆమెకు వైఎస్ కుటుంబ ఆస్తిలో వాటాని పంచి ఇవ్వాల్సి ఉంటుంది.

అత్త సొమ్ము అల్లుడు దానం చేయవచ్చు కానీ సొంత ఆస్తిని పంచిపెట్టాలంటే ఎంతటి వాడికైనా చాలా కష్టమే. అందుకే జగన్మోహన్‌ రెడ్డి అమ్మలు, అక్కా చెల్లెమ్మల జాబితాలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల లేరనుకోవచ్చు. సొంత తల్లికి, చెలెళ్ళకు న్యాయం చేయని జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్రంలో మహిళలకు ఆస్తి సమకూర్చి ఇస్తున్నానని గొప్పగా చెప్పుకోవడం చాలా విడ్డూరంగా లేదూ?

ADVERTISEMENT
Latest Stories