బీజేపీతో చెలిమికి జగన్ తహతహలాడుతున్నారా? ప్రస్తుతం చిక్కుకుంటున్న ‘అష్టదిగ్భంధనం’ నుండి తనను ఆదుకునే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరేనని భావిస్తున్నారా? రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పంచన చేరక తప్పదని జగన్ బలంగా విశ్వసిస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలన్నింటికి అవుననే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. బీజేపీతో చెలిమి కోసం ఢిల్లీలో జగన్ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తోన్న టాక్.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంతో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో తన ఆక్రందన వ్యక్తం చేసినా, ఫలితం లేకుండా పోయింది. ఇది వైసీపీని తీవ్ర నిరాశకు గురి చేసింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో సీబీఐ జోరు పెంచింది. దీంతో ప్రస్తుత తరుణంలో తనను ఆదుకునేది బీజేపీ తప్ప మరోటి కాదని భావించిన జగన్ ఆ పార్టీతో జట్టు కట్టడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ క్రమంగా దూరం కావడంతో, ఇదే మంచి అవకాశంగా భావించిన జగన్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తనకు మేలు జరుగుతుందని, అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం నెమ్మదిస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. బీజేపీకి స్నేహహస్తం చాచేందుకే జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన నేపథ్యంలో జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో, మరో వారం రోజుల తర్వాత మాత్రం ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుందని జగన్ ఆశగా ఉన్నట్లు పొలిటికల్ టాక్.



