ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో జగన్, షర్మిల మద్య ఎలాగూ రేసు మొదలవుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకొన్నాము. ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి చెప్పుకొందాము.
వైఎస్ షర్మిలకి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ఆమెకు రెడీమేడ్ ‘వైఎస్ బ్రాండ్ ఇమేజ్’తో పాటు, జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ అండదండలు, ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్, వైఎస్ అభిమానులు ఉన్నారు. వైఎస్ షర్మిలకు సొంతంగా రాజకీయాలు చేయగల తెలివితేటలు, పుష్కలంగా అర్ధబలం కూడా ఉన్నాయి.
ఇక రాజకీయాలలో రాణించేందుకు ఎంతైనా కష్టపడగలరని, అందుకు ఎన్నడూ వెనకాడరని వైఎస్ షర్మిల ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డిలా కష్టపడితే ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావచ్చనేది ఆమె కల. కనుక ఆ కల నెరవేర్చుకోవడానికి ఇది ఆమెకు దక్కిన ఓ గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. కనుక ఏపీ రాజకీయాలలో ప్రవేశించి తన కల నెరవేర్చుకోవడానికి గట్టిగా కృషి చేయడం ఖాయమే.
ముందుగా… వైసీపి నుంచి కొందరు సీనియర్ నేతలను ఆకర్షించి తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలలో కనీసం ఓ 10-20 సీట్లు గెలుచుకొనేందుకు గట్టిగానే ప్రయత్నించవచ్చు. ఈ రెండూ సాధిస్తే ఏపీ రాజకీయాలలో ఆమె అధ్యాయం మొదలైన్నట్లే!
అయితే ఆమె కూడా అన్నలాగే అనేకసార్లు మడమ తిప్పి నమ్ముకొన్నవారిని నట్టేట ముంచారు. ఆమె తెలంగాణలో పుట్టినిల్లు, మెట్టినిల్లు అంటూ డైలాగ్స్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల కోసమే నా జీవితం అంకితం అని చెప్పుకు తిరిగారు.
కానీ ఇప్పుడు అవన్నీ మరిచిపోయి ఏపీలో ‘మరో రాజన్న రాజ్యం’ స్థాపించేందుకు వస్తున్నారు. అంటే ఆమె చెప్పినవి, చెప్పబోయేవీ అన్నీ అబద్దాలే అని ముందే తెలిసిపోతోంది. ఆమె తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకొనేందుకే ఏపీ వస్తున్నారు తప్ప ఏపీ కోసం కాదని అర్దమవుతోంది. కనుక ఆంధ్రా ప్రజలు ఆమె మాటల గారడీకి పడతారో లేరో మున్ముందు తెలుస్తుంది.
అయితే ఆమె రాజకీయ జీవితంలో ఇదే ‘చివరి ఇన్నింగ్’ కనుక ఏపీ కాంగ్రెస్కి ప్రాణం పోసి బ్రతికించుకొని తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారని చెప్పవచ్చు. అవి పొత్తులు కావచ్చు… కత్తులు కావచ్చు…ఆమె దేనికీ వెనకాడకపోవచ్చు. ఆమె కత్తికి ప్రత్యర్ధులు బలవుతారా లేదా ఆమె నాలుగు స్తంభాలాటలో ఓడిపోతారా?అనేది ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి తేలిపోతుంది.
—




