టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకొన్నందుకు జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ ‘దత్తపుత్రుడు’, ‘ప్యాకేజ్ స్టార్’, ‘కార్లు మార్చిన్నట్లు భార్యలను మారుస్తాడంటూ’ ఎన్ని మాటలన్నారో అందరికీ తెలుసు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి పార్టీలో చేరిపోయారు. మొదట ఆంధ్రాకు వచ్చేందుకు నిరాకరించిన ఆమె ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం తెలంగాణలో తనను నమ్ముకొన్నవారందరినీ అన్నలాగే రోడ్డున పడేసి ఏపీకి వచ్చేస్తున్నారు.
కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెను కూడా ప్యాకేజ్ పొలిటీషియన్, కాంగ్రెస్ దత్తపుత్రిక, కార్లు మార్చిన్నట్లు పార్టీలను మార్చేస్తారని అనగలరా?అసలు ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియకనే వైసీపి నేతలందరూ సజ్జల రామకృష్ణా రెడ్డి వైపు చూస్తుంటే ఆయన జగన్మోహన్ రెడ్డివైపు… జగన్ కేసీఆర్ వైపు చూస్తున్నారు!
ఏది ఏమైనప్పటికీ వైఎస్ షర్మిల నేడో రేపో ఏపీలో అడుగుపెట్టడం ఖాయం. తన ప్రభుత్వం, పాలన గురించి గొప్పలు చెప్పుకొంటున్న జగనన్ననే నిలదీయడం కూడా ఖాయమే. కనుక ఆమెను ఎదుర్కోవడానికి సిద్దపడక తప్పదు. జగన్ సందించిన బాణం తెలంగాణలో 3,000 కిమీ ప్రయాణించి తిరిగివచ్చి జగన్ గుండెల్లోనే గుచ్చుకొంటుండటం కూడా దేవుడి స్క్రిప్టేనేమో?




