షర్మిల సెంటిమెంట్: అధికార పార్టీకి శాపంగా…ప్రతిపక్ష పార్టీకి వరంలా…!

YS Sharmila

జగనన్న వదిలిన బాణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటనలు ముగించుకుని తిరిగి విసిరినవారి ఎదుటే బాణమై నిలవనున్నారు వైస్ షర్మిల. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రంగాలలో రాజకీయ రంగం కూడా ఒకటనే చెప్పాలి. షర్మిల రాజకీయ ప్రయాణం మొదటినుంచి గమనిస్తే ఒక్క విషయం సుస్పష్టమవుతుంది.

షర్మిల రాజకీయంగా అడుగు ముందుకేసిన ప్రతి సారి అది అధికార పార్టీకి శాపంగా.. . ప్రతిపక్ష పార్టీకి వరంలా…మారుతుంది. జగన్ చెప్పినట్టు ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ ఏమో మరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ పార్టీ పై నిందలు వేసి అన్న వెంట నిలబడిన షర్మిల రాజకీయ ప్రయాణం అధికార పార్టీకి ఎప్పుడు ఎదురుదెబ్బగానే తయారయ్యింది.

ADVERTISEMENT

షర్మిల రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. రాష్ట్ర విభజన తరువాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారం నుండే కాదు ఏకంగా రాష్ట్రము నుండే కనుమరుగయ్యింది. ఆ సమయంలో షర్మిల తన అన్న కోసం అధికార పార్టీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగింది. ఆ ఎన్నికల ఫలితాలతో అధికార కాంగ్రెస్ గద్దె దిగడం ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ గద్దెనెక్కడం జరిగిపోయింది.

ఇలా షర్మిల సెంటిమెంట్ ప్రతిపక్ష పార్టీలకు వరంలా మారుతుందని తొలిసారిగా తెలిసొచ్చింది. అలాగే ఆ తరువాత ఏపీ లో జరిగిన 2019 ఎన్నికలలో షర్మిల సెంటిమెంట్ అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కి శాపంగా మారి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కి వరంగా తయారయ్యిందని మరో సారి రుజువుచేసింది. ఇలా ఏపీలో షర్మిల సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో జగన్ సీఎం అవ్వడం, వచ్చిన పని పూర్తయ్యిందని షర్మిలను తెలంగాణకు పంపారో ఆమె వెళ్లిపోయిందో కానీ తెలంగాణ లో రాజకీయం మొదలుపెట్టారు.

YSRTP అంటూ ఒక కొత్త రాజకీయ పార్టీకి ఏర్పాటు చేసి పద్దేళ్లుగా అధికారం అనుభవిస్తున్న కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేసి తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తా అంటూ పాదయాత్రలు చేసిన షర్మిల రాజన్న రాజ్యాన్ని స్థాపించ లేకపోయినప్పటికీ తన సెంటిమెంట్ తో అధికార పార్టీ బిఆర్ఎస్ ను గద్దె దింపి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించారు. ఇలా షర్మిల “ప్రతిపక్ష పార్టీల ఆరాధ్య దేవతగా” మారిపోయారు.

ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ పై తన బాణాన్ని ఎక్కుపెట్టడానికి షర్మిల సిద్ధమయ్యారు.రేపు ఏపీ కాంగ్రెస్ అధికార బాధ్యతలు తీసుకోవడానికి హైద్రాబాద్ నుండి ప్రత్యేక విమానంలో వైస్సార్ ఆత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరా రెడ్డి తో కలిసి కడప చేరుకున్నారు షర్మిల. అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ కి చేరుకొని తండ్రికి నివాళ్లు అర్పించి తన రాజకీయ భవిష్యత్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఈ విధంగా షర్మిల సెంటిమెంట్ మరోసారి ఏపీలో మ్యాజిక్ చేయగలిగితే జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అధికార పార్టీగా మారడం ఖాయంగా కనపడుతుంది. 2024 ఎన్నికలు షర్మిల సెంటిమెంట్ ను కొనసాగిస్తుందా…లేదా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వరకు వేచి చూడాల్సిందే.

గత ఎన్నికలలో జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కడానికి షర్మిల ఎంతలా కష్టపడిందో ఇప్పుడు అదే పదవిని తన చేతులతో దూరం చేయడానికి అంతకంటే ఎక్కువ కష్ట పడాల్సి ఉంటుంది. మరి ఈసారి షర్మిల సెంటిమెంట్ పవర్ ఎంతో …? జగన్ బటన్ బలమెంతో..?తేలాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories