అన్నా ఇంత పని చేస్తావనుకోలేదు… యాక్!

YS Sharmila

గుప్పెట మూసి ఉన్నంత వరకే ఏదైనా రహస్యం… తెరిస్తే రచ్చరచ్చ… కంపు కంపే అవుతుంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవలు కూడా ఇటువంటివే.

ఇంతకాలం కుటుంబం పరువు పోతుందని నోరు మూసుకున్నానని కానీ తన అన్నే ఈ విషయాలన్నీ బయటపెట్టి మమ్మల్ని కోర్టుకి లాగి కుటుంబం పరువు మంట గలిపారంటూ వైఎస్ షర్మిల ఓ పెద్ద లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిలో ఆమె జగన్‌ మీద బాంబులు వర్షమే కురిపించారు.

ADVERTISEMENT

ఆమె లేఖ సారాంశం: వైఎస్ బ్రతికి ఉండగా ఆస్తుల పంపకాలు జరుగలేదు. సొంత మీడియా ఉంది కనుక జరిగాయని జగన్‌ అబద్దాలు వ్రాయించారు. సాక్షితో సహా అన్నీ కుటుంబ ఆస్తులే తప్ప జగన్‌ స్వార్జితం ఏమీ లేవు.

కనుక వాటన్నిటిలో నలుగురు మనుమలకి సమానంగా వాటాలు ఇవ్వాలని మా తండ్రిగారు ఆదేశించారు. కానీ జగన్‌ పాటించలేదు.

విజయమ్మగారు అనేక సార్లు జగన్‌కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వందల కొద్దీ లేఖలు కూడా వ్రాసినా జగన్‌ ఆస్తులు పంచడానికి అంగీకరించలేదు.

మా తండ్రిగారు చనిపోయిన తర్వాత జగన్‌, వైసీపి కోసం నేను ఎంతగానో శ్రమించాను. అందువల్లే అప్పుడు నా పిల్లలని కూడా సమానంగా భావించి రూ.200 కోట్లు ఇచ్చారు. అయితే అది ఓ కంపెనీలో నా వాటాగా వచ్చిన డివిడెండ్ మాత్రమే. దానినీ అప్పుగా ఇచ్చిన్నట్లు జగన్‌ చూపారు.

ముఖ్యమంత్రి కాగానే జగన్‌లో మార్పు మొదలైంది. మేమందరం కలిసి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినప్పుడు మనం విడిపోదామని పట్టుబట్టారు. నేనూ, అమ్మా వారిస్తున్నా వినలేదు. అప్పుడే ఈ ఆస్తుల పంపకాల కధ మొదలైంది. అప్పుడూ నాకు చాలా అన్యాయం చేశారు. కానీ నేను మౌనంగా తెలంగాణకు వెళ్ళిపోయాను.

ఆరోజు నాకు ఇస్తామని ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులను నేటికీ ఇవ్వలేదు. ఇప్పుడు రాజకీయ కారణాలు చూపి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆస్తులు పంచి ఇస్తానని, రాజీ చేసుకుందామని కొందరు బందువులను నా పంపారు. కానీ తనకు, తన భార్య భారతికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడకూడదనే షరతు విధించారు. ఆస్తుల కోసం నా రాజకీయాలను వదులుకోలేనని నిష్కర్షగా చెప్పేశాను.

దాంతో ఇవన్నీ ఆయన ద్వారానే బయటకు వచ్చాయి. వాటి వలన ప్రజలలో తన పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భయంతో, మేము తనని అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేయించేందుకు కుట్రలు పన్నుతున్నామనే పుకారు పుట్టించారు. అది మా పరిధిలో ఉన్నది కాదని అందరికీ తెలుసు.

ఇంత జరిగినా ఏనాడూ నేను, అమ్మా ఈ ఆస్తుల గొడవలను బయటపెట్టలేదు. వాటి కోసం పట్టుబట్టలేదు. కానీ జగనన్నే బయటపెట్టి రచ్చ చేశారు.

తల్లిని, చెల్లిని కూడా మోసం చేసి చివరికి కోర్టులకు ఈడ్చేందుకు వెనకాడలేదని మా తల్లిగారు బాధపడని రోజు లేదు. నా కడుపున ఇటువంటి కొడుకు పుట్టాడా?అని ఆమె బాధపడని రోజు లేదు.

జగన్‌ ఎవరి కొంగు చాటున ఉన్నారో, ఆయనతో ఎవరు ఇవన్నీ చేస్తున్నారో అందరికీ తెలుసు.

సాక్షి మీడియా చేతిలో ఉంది కనుక జగన్‌ మాపై బురద జల్లుతున్నారు. కనుకనే ఈ వాస్తవాలన్నీ అందరికీ తెలియజేసేందుకు ఈ లేఖ వ్రాస్తున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

YS Sharmila Open Letter To YS Jagan

YS Sharmila Open Letter To YS Jagan

YS Sharmila Open Letter To YS Jagan

ADVERTISEMENT
Latest Stories