జగన్పై రాయి దాడి ఘటనని ఎన్నికలలో వైసీపికి మంచి మైలేజి ఇస్తుందని ఏ సలహాదారు చెప్పాడో కానీ అది బెడిసికొట్టిన్నట్లే ఉంది. జగన్పై దాడిని వైసీపి, దాని సొంత మీడియా ఓసారి ఖండించి ఊరుకుంటే కొంతలో కొంతైనా ప్రజలకు సానుభూతి కలిగి ఉందేమో?
కానీ దానిని భూతద్దంలో నుంచి చూపిస్తూ హత్యాయత్నంగా చిత్రీకరించడం, టిడిపి నేత బోండా ఉమాని దానిలో ఇరికించే ప్రయత్నం చేయడంతో రాజకీయ మైలేజి కోసం ఆడుతున్న డ్రామాగా తేలిపోయింది.
గత ఎన్నికలలో వివేకా హత్య గురించి వైసీపి నేతలు చాలా మాట్లాడారు. వారి మీడియా కూడా దానిని తమ కోణంలో నుంచి చూపిస్తూ అనేక కధనాలు ప్రచురించింది. కానీ ఈసారి ఎన్నికలలో వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టుని ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గత ఎన్నికలలో వైసీపికి ఎంతగానో ఉపయోగపడిన వివేకా హత్య ఘటన ఈ ఎన్నికలలో వైసీపికి గుదిబండగా మారుతుండటమే ఇందుకు కారణం. కానీ ఒకే హత్య కేసు వలన వైసీపికి ఒక ఎన్నికలలో మేలు, మరో ఎన్నికలలో కీడు ఎలా జరుగుతుంది? అనే ప్రశ్నకు వైసీపి నేతలే సమాధానం చెప్పాలి.
ఇక ఈ గులక రాయి డ్రామాని వైసీపి కొనసాగిస్తుండటంతో, వైఎస్ షర్మిల కూడా దీనిపై స్పందిస్తూ, “ఓ చిన్న గులక రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి అది హత్యాప్రయత్నమే అంటూ చెప్పుకొంటున్నారు. కానీ ఆనాడు బాబాయ్ వివేకానంద రెడ్డిని ఏడుసార్లు గొడ్డలితో నరికి, నరికి, నరికీ చంపారు.
చంపాక గుండెపోటు కధ అల్లి చెప్పారు కూడా. అంటే గొడ్డలి కంటే గులక రాయే చాలా ప్రమాదకరమైనదా? గొడ్డలి వేటు కంటే గులక రాయితో దాడే చాలా తీవ్రమైనదా?
వివేకా హత్య గురించి మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటారు. సొంత చెల్లిని కాదని హత్యారోపణలు ఎదుర్కొంటున్నవాడిని చంకనెక్కించుకుని తిరుగుతుంటారు… ఎందువల్ల? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.




