ఓవర్ నైట్ స్టార్ టైగర్ రాంబాబు ప్రమోషన్స్ దేనికంటే…

Ambati Rambabu during political appearance as YSRCP projects him as Kapu leader amid arrest controversy

వైసీపీలో కాపు నాయకులు మరెవరూ లేనట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబుని ‘టైగర్ రాంబాబు’గా వైసీపీ ప్రాజెక్ట్ చేసింది. అంబటి అరెస్ట్ కాగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అయన కుటుంబ సభ్యులను పరామర్శించడం రోటీన్ చర్యగా అనిపించవచ్చు. కానీ జగన్‌ ఏం చేసినా చాలా లెక్క ప్రకారమే చేస్తారు.

కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముగ్గురూ ఏదో రోజు గొడవపడి విడిపోయి తమంతట తామే ప్రభుత్వం కూల్చుకుంటారని ఇంతకాలం జగన్‌ చాలా ఓపికగా ఎదురు చూశారు. వారి మద్యలో చిచ్చు పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు.

ADVERTISEMENT

అయినా వారి ముగ్గురి బంధం నానాటికీ బలపడుతోందే తప్ప ఎక్కడా తేడా కొట్టడం లేదు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి? అనే చర్చ జరుగుతుందనుకుంటే, వారిద్దరూ దాని కోసం పోటీ పడుతున్నట్లు చిన్న సంకేతం కూడా ఇవ్వడం లేదు.

ఇద్దరూ చంద్రబాబు నాయుడుకే జై కొడుతున్నారు. పైగా మన మద్య జగన్‌ చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ స్వయంగా పార్టీ కార్యకర్తలకు చెపుతున్నారు కూడా.

అసలు సిఎం చంద్రబాబు నాయుడు వారిద్దరికీ ఎలా నచ్చజెప్పారో… ఏం మ్యాజిక్ చేశారో జగన్‌ ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

వారి మద్య చిచ్చు పెట్టడం సాధ్యం కాదని తేలిపోయింది. కనుక వాట్ నెక్స్ట్?అని జగన్‌ ఆలోచించే ఉంటారు. పవన్ కళ్యాణ్‌ వెనుక కాపు సామాజిక వర్గం ఉంది. కనుక ఆయనకి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఓ కాపు నాయకుడిని తయారు చేసి కాపుల ముందుంచితే ఆ బొమ్మని చూపించి వారిని వైసీపీ వైపు ఆకర్షించవచ్చని జగన్‌ భావిస్తుండవచ్చు.

ఆ ప్రయత్నంలోనే టైగర్ అంబటి రాంబాబు ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఆయనకు సత్తెనపల్లి లాటరీ కూడా తగిలి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సివస్తే కాపు నాయకుడుకి కమ్మల వేధింపులు, అవమానాలు అంటూ సానుభూతి ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగానే ఉన్నారు.

కనుక ఇక్కడ అంబటి రాంబాబు అరెస్ట్, కేసులు, జైలు పాయింట్ కాదు. ఆయనని కాపు నాయకుడుగా ప్రమోట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? అనేదే పాయింట్.

ఒకవేళ జగన్‌ మనసులో ఇదే ఆలోచన ఉండి ఉంటే, వైసీపీలో బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, లేడీస్ సెంటిమెంట్ కూడా ఉండాలంటే వంగా గీతనో కాపు నాయకుడుగా ప్రమోట్ చేయవచ్చు.

కానీ మంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా ప్రభుత్వం, పార్టీ పరువు తీస్తున్న అంబటి రాంబాబుని గంట లేదా అరగంట సమయానికి కూడా ఇలా ప్రమోట్ చేసి ఉండకూడదు. కాపు నేతగా సంబరాల రాంబాబు రాంగ్ ఛాయిస్ అని చెప్పక తప్పదు.

ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు తంతే బూరెల గంపలో పడినట్లు జగన్‌ పుణ్యమాని రాత్రికి రాత్రి ‘టైగర్ రాంబాబు’ అయిపోయారు!

సత్తెనపల్లిలో ఏటా సంక్రాంతికి ఆయన బలవంతంగా లాటరీ టికెట్లు అంటగడుతుంటారు. కానీ ఈసారి ఆ లాటరీ ఆయనకే తగిలింది. కనుక అయన చాలా లక్కీ.

ఆ లాటరీ కేసులో అంబటి రాంబాబుని పోలీసులు గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరుస్తున్నారు. బెయిల్‌పై బయటకు వస్తారో లాటరీ తగిలి మళ్ళీ జైలుకి వెళతారో కాసేపట్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories