వైసీపీ వెన్నుపోటు విజయవంతమైంది. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీ ఇంత ఘనంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించుకోగలిగిందంటే ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. కానీ ఇటువంటి భావన ప్రజలకు కలిగితే నవ్వులపాలయ్యేది, నష్టపోయేది వైసీపీయే.
కూటమి ప్రభుత్వం పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించి తమని వేధిస్తూ తమ గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తోందంటూ ఇంతకాలం తాము చేస్తున్న విమర్శలు, వాదనలు సరికావని ప్రజలు భావించవచ్చని వైసీపీ నేతలు చాలా ఆలస్యంగా గ్రహించినట్లున్నారు.
అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి పలువురు వైసీపీ నేతలు పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తూ, సీన్ క్రియేట్ చేసేందుకు గట్టిగా కృషి చేశారు.
తద్వారా తాము శాంతియుతంగా నిరసనలు తెలపాలనుకున్నా కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డగించిందని వాదించేందుకు అవకాశం కల్పించుకున్నారు. రాజకీయ పార్టీలు ఈవిదంగా వ్యవహరించడం సహజమే.
కానీ ఇంతకాలం కేసుల భయంతోనే కలుగుల్లో ఎలుకల్లా దాగున్న వైసీపీ నేతలు ఇప్పుడు బయటకు వచ్చి ఈవిదంగా పోలీసులతో గొడవ పెట్టుకుంటే మళ్ళీ కొత్త కేసులు నమోదవుతాయని గ్రహించినట్లు లేదు!
పోలీస్ అధికారితో చాలా దురుసుగా మాట్లాడిన అంబటి రాంబాబుపై ముందుగా కేసు నమోదయ్యే అవకాశం ఉందని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది.
ఇంకా ఎంతమందిపై కొత్త కేసులు నమోదవుతాయో తెలీదు కానీ ఇళ్ళలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న వైసీపీ నేతలని వారి అధినేత జగన్మోహన్ రెడ్డి బలవంతంగా బయటకు రప్పించి, మళ్ళీ కొత్త కేసులు నమోదయ్యేలా చేసి వెన్నుపోటు పొడిచారని చెప్పక తప్పదు.




