ఒంగోలులో వైసీపీలో వేడి ఇంకా చల్లారిన్నట్లు లేదే!

Balineni-Srinivasa-Reddy-Flex-Controversy-in-Ongoleఇటీవల ఒంగోలు వైసీపీలో రగిలిన చిచ్చు ఇంకా పూర్తిగా ఆరిన్నట్లు లేదు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తెలియజేయకుండా సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి తమకు నచ్చిన ఎస్పీని జిల్లాకు బదిలీ చేయడంతో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం పెట్టి పార్టీలో కొందరు తనపై, తన కుమారుడిపై దుష్ప్రచారం చేస్తూ తమపై సిఎం జగన్మోహన్ రెడ్డికి పిర్యాదులు చేస్తూ తమని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో వైసీపీ అధిష్టానం వెంటనే స్పందించి, బాలినేని శాంతింపజేయడానికి ఆయన కోరిన్నట్లుగా ఒంగోలు డీఎస్పీని దర్శికి, దర్శి డీఎస్పీని ఒంగోలుకి బదిలీ చేయించింది. కానీ ఆయన ఇంకా శాంతించిన్నట్లు లేదు. ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలినేని, ఆయన అనుచరుల ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. దానిలో వైసీపీ పేరు, చిహ్నం కానీ, సిఎం జగన్మోహన్ రెడ్డి పేరు, ఫోటో గానీ లేదు!

ADVERTISEMENT

“ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నా అతిరధ మహారధులకు స్వాగతం సుస్వాగతం…” అంటూ ఓ వైపు బాలినేని నిలువెత్తు ఫోటోని ముద్రించారు. దానిని బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరులే ఏర్పాటు చేశారని వేరే చెప్పక్కరలేదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ చలివేంద్రాన్ని ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్లెక్సీ బ్యానర్‌లో పేర్కొన్నారు. కనుక దానిలో తప్పనిసరిగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి ఉండాలి. కానీ ముద్రించలేదు!

అంటే ఈవిదంగా బాలినేని వర్గం పార్టీ అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేస్తోందని భావించవచ్చు. అయితే బాలినేని శ్రీనివాస రెడ్డి, అనుచరులకు తాము ‘పార్టీ లైన్’ దాటుతున్నామని, కనుక సస్పెన్షన్ వేటు పడవచ్చనే విషయం తెలియదనుకోలేము. కానీ ఈవిదంగా చేస్తున్నారంటే వారు పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అని సంకేతాలు పంపిస్తున్నట్లు భావించవచ్చు. ఇంతకీ బాలినేని శ్రీనివాస రెడ్డి వర్గం పార్టీ అధిష్టానం నుంచి ఏమి ఆశిస్తున్నారు?ఆయన ఏదో ఓ సాకుతో పార్టీని వీడి టిడిపిలో చేరాలనుకొంటున్నారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories