వైసీపీ అధికారంలో ఉన్నప్పటి కధలు నేటికీ అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. నాటి వీరగాధలని మరిపించేలా వైసీపీ కార్యకర్తలు దూసుకుపోతున్నారు.
మొన్న తమ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఒకరు తాడేపల్లి ప్యాలస్ వద్ద ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తున్న కేసీఆర్, కేటీఆర్ కటవుట్స్ పెట్టారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ కార్యకర్తలు అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ఆ వేడులలో వారు ఓ ఫ్లెక్సీ బ్యానర్ పెట్టారు. దానిలో జగన్ ఫోటోతో “2029 ఎన్నికలలో వైసీపీకి 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్లు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని…” అని పెట్టారు.
ఈ ఘటనపై గ్రామస్తులు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులను రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ ఫ్లెక్సీని ముద్రించిన ప్రింటింగ్ దుకాణ యజమానిపై కూడా కేసు నమోదు చేసి దుకాణం సీజ్ చేశారు.
అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేసి బ్రహ్మ సముద్రం మండలంలోని బొమ్మసానిపల్లి కూడలి వద్ద మూడు పొట్టేళ్ళను నరికి వాటి రక్తంతో అక్కడ ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీ బ్యానర్కి రక్తాభిషేకం చేశారు!
అది చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. వారి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు.
వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారు?అనే ప్రశ్నకు అధినేత జగన్ ప్రోత్సాహం కారణంగా కనిపిస్తోంది.
అయితే ఇలాంటి అరాచక ధోరణిని జగన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అని మరో సందేహం కలుగుతుంది. సినిమాలలో విలన్లు ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ భయపెడుతూ లొంగదీసుకొని ఇష్టారాజ్యం చేస్తుంటారు. కనుక మనం కూడా అదేవిధంగా అందరినీ భయపెట్టి లొంగదీసుకొని అధికారంలోకి రావచ్చని జగన్ భావిస్తున్నట్లనిపిస్తుంది.
కనుక అందరినీ భయబ్రాంతులకు గురి చేయడమనేది కేవలం రాజకీయ బెదిరింపుగా చూడరాదు. ఇది జగన్ సరికొత్త రాజకీయ విధానంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక జగన్ ఆదేశం లేదా ప్రోత్సాహం వల్లనే పార్టీ శ్రేణులు ఇంతగా రెచ్చిపోతున్నట్లు భావించవచ్చు.
ఈ విధానంతో జగన్ ఆశించిన ఫలితాలు వస్తాయా లేక పర్యవసానాలు వేరేగా ఉంటాయా?అంటే ఈ పద్దతిలో ఏ సినిమాలో విలన్లు విజయం సాధించిన దాఖలాలు లేవు. కనుక వైసీపీ ఈ కొత్త విధానంతో దాని వినాశానానికే దారి తీయవచ్చు.






