ప్రభుత్వం మంచి పనిచేసినా మెచ్చుకోకూడదు… ఏదో పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉండాలనే ఫార్ములాకి వైసీపీ ఫిక్స్ అయిపొయింది.
తాజాగా దాని సొంత మీడియాలో ఈరోజు ఆన్లైన్ ఎడిషన్లో ‘ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ’ అంటూ ఓ వార్త వేశారు. చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే ఉద్యోగాలు లేనివారికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భ్రుతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించింది.
లేబర్ ఫోర్స్ సర్వే-2025, జూలై-సెప్టెంబర్ నివేధిక ప్రకారం దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్లో 8.9%, ఆంధ్రప్రదేశ్ 8.2%, కేరళలో 8.0% నిరుద్యోగం ఉందని పేర్కొంది. జమ్ము కాశ్మీర్ (6.1), అసోం (5.2), ఝార్ఖండ్ (4.3) నిరుద్యోగం ఉందని పేర్కొంది. అంటే జమ్ము కాశ్మీర్, అస్సాం, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కంటే నిరుద్యోగ సమస్య తక్కువగా ఉందని చెపుతోందన్న మాట!!!
కానీ యూపీఎస్సీ తాజా నివేదిక ప్రకారం అత్యధికంగా యూపీలో 24%, జమ్ము కాశ్మీర్ 23.2%, ఝార్ఖండ్: 12.2 అస్సాం 10.4%, తెలంగాణ 8.3%, ఆంధ్రప్రదేశ్లో 4.8% నిరుద్యోగ సమస్య ఉంది.
ఒకవేళ వైసీపీ సొంత మీడియా చెప్పినట్లుగానే ఏపీలోనే నిరుద్యోగ సమస్య ఎందుకు ఎక్కువగా ఉందని ఆలోచిస్తే దానికి 5 ఏళ్ళ వైసీపీ విధ్వంస పాలనే కదా?
ఐదేళ్ళ పాటు జగన్ సంక్షేమ పధకాలు, రాజకీయ కక్షలు, ఓటు బ్యాంక్ రాజకీయాలే చేశారు తప్ప పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షింఛి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయలేదు. పైగా ఉన్నవాటిని కూడా తరిమేశారు. కనుక ఏపీలో నిరుద్యోగం ఎక్కువగా ఉంటే ఆ పాపం ఆయనదే తప్ప సిఎం చంద్రబాబు నాయుడు కానే కాదు.
జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే సుమారు రూ. 10-15 లక్షల కోట్ల పెట్టుబడులు, అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలను తెస్తున్నారు. వాటిలో చాలా వాటికి శంకుస్థాపనలు జరిగి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటి ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి కదా?
వైసీపీ హయంలో సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించుకొని వారికి నెలకు రూ.5,000 జీతం మాత్రమే ఇస్తూ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వాటినే ఉద్యోగాల కల్పన అని గొప్పగా చెప్పుకుంటోంది. కానీ వైసీపీ దిగిపోయే సమయానికి వారిని కూడా రోడ్డున పడేసిపోయింది కదా?
వైసీపీ ప్రభుత్వం కనీసం డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 12 నెలల్లోనే డీఎస్సీ ద్వారా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కదా?
జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెట్టుబడిదారులకు సదాభిప్రాయం ఏర్పడి ఉండేది. జగన్ హయంలోనే లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కానీ మూడు రాజధానులు, విశాఖ రాజధాని పేరుతో చేసిన డ్రామాలు చూసి అందరూ పారిపోయారు!
జగన్ ముఖ్యమంత్రి కాగానే అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో సుమారు 25-30 వేల మంది కార్మికులు కూడా ఉద్యోగాలు కోల్పోయారు కదా? ఇంత నిర్వాకం చేసి ఇప్పుడు ఏపీలో నిరుద్యోగ సమస్యకి చంద్రబాబు నాయుడే కారణం అని నిందిస్తుండటం సిగ్గుచేటు!






