రాజకీయ పార్టీకి డప్పు కొట్టుకోవడానికి, ప్రత్యర్ధులను చీల్చి చెండాడానికి సొంత మీడియా ఉండాలనే ఆలోచన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిదే.
ఆయన సాక్షి ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన్నట్లు కొందరు చెపుతుంటారు. అది నిజమో కాదో తెలీదు కానీ ఒకవేళ ఆయన బ్రతికి ఉంటే ‘సొంత మీడియా ఉంటే ఆ కిక్కే వేరబ్బా’ అని ఒప్పుకుని ఉండేవారే.
సొంత మీడియా సంస్థ ఉంది కనుకనే జగన్-షర్మిల ఆస్తుల వివాదాలలో ‘జగన్ మంచితనమే కొంప ముంచిందని’ జగన్ గురించి గొప్పగా వ్రాసుకోగలిగారు.
జగన్కి సొంత మీడియాతో పాటు వైసీపికి అనుకూల మీడియా కూడా ఉంది కనుకనే ‘షర్మిలకి జగన్ ఆస్తులు పంచి ఇస్తున్నా ఆయన భార్య భారతి అభ్యంతరం చెప్పలేదని, భర్తకు చెల్లి అంటే ఎంత ప్రాణమో, ఆమెకూ అంతే ప్రాణమని’ వ్రాయించుకోగలుగుతున్నారు.
తల్లి, చెల్లితో ఆస్తుల కోసం కేసులు వేసి వారిని కోర్టుకి ఈడ్చిన జగన్ ‘ధర్మాత్ముడని’ వ్రాసుకోగలుగుతున్నారు. ‘చట్టాలను గౌరవించడం తప్పా?’ అంటూ జగన్ అమాయకపు ఫోటోతో ఓ మంచి స్టోరీ వేసుకొని ఈ కేసులో తానే బాధితుడిని అన్నట్లు వ్రాయించుకోవడం సొంత మీడియా ఉంటేనే సాధ్యం.
పనిలో పనిగా వైసీపి నేతలందరి చేత చెల్లిని తిట్టించడానికి కూడా సొంత మీడియా చాలా ఉపయోగపడుతోంది. ఇది అన్నా చెల్లెళ్ళ ఆస్తుల గొడవలు కాగా, మద్యలో సిఎం చంద్రబాబు నాయుడుని నిందించడానికి కూడా మీడియా ముసుగు బాగానే ఉపయోగపడుతోంది.
జగన్ మీద ఈగ వాలగానే ఇరాన్, పాలస్తీనాల మీద అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులు పడినట్లు సొంత మీడియా అలర్ట్ అయిపోయి యుద్ధం ప్రారంభించేస్తుంది.
అయితే ఇదే సొంత మీడియా జగన్కి మార్గదర్శనం చేసి ఉంటే నేడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యుండేవారు. కానీ జగన్కి తాన తందాన అంటూ శల్య సారధ్యం చేస్తూ రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసింది కదా?
ఈవిదంగా చేసినందుకు జగన్ ఐప్యాక్, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి పలువురిని వదిలించుకున్నారు. కానీ సొంత మీడియా తన సొంతం కాదంటున్నా దానిని ఆయన వదలడం లేదు. ఆయనని అది వదలడం లేదు. అంటే ఈ పతనం ఇంకా సరిపోదనుకోవాలేమో?




