ఒకే రక్తం పంచుకు పుట్టిన వారికైనా డీఎన్ఏ వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ దుకాణానికి వేర్వేరుగా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. కానీ వైసీపీలో మాత్రం పైనుంచి కింద కార్యకర్తల వరకు అందరికీ ఒకటే డీఎన్ఏ ఉండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘వైసీపీ డీఎన్ఏ’ అంటే ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ దాని వివరణ అవసరం లేదు. కానీ ఒకే రకమైన డీఎన్ఏ కలిగి ఉండటం చాలా అరుదు కనుక దాని గురించి నాలుగు ముక్కలు చెప్పుకోక తప్పదు.
శాంపిల్ 1: వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు… చెప్పుకుంటే ఓ 4-5 సీజన్లకు సరిపోయే అంత పెద్ద వెబ్ సిరీస్ అవుతుంది. అందరికీ తెలిసిన ఆ విషయాల గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
శాంపిల్ 2: నాడు వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపి కార్యాలయంపై దాడి చేసి విద్వంసం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో వంశీ, అనుచరులని బుక్ చేశారు.
దాని నుంచి తప్పించుకోవడానికి వారు తమపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ ఎత్తుకుపోయారు. అక్కడ అతనిని బెదిరించి భయపెట్టి ఆ కేసు వాపసు తీసుకునేలా చేశారు. అందుకుగాను వంశీతో సహా వారిపై కొత్తగా కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఆ కేసు ఇంకా సాగుతూనే ఉంది.
శాంపిల్ 3: నాడు వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇటీవల అనంత బాబు అనుచరులు ఆ కేసులో ప్రధాన సాక్షులైన అరవ దుర్గ శివ ప్రసాద్, మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్లను కిడ్నాప్ చేసి ఒక అపార్ట్మెంట్లో బందించారు.
అనంతబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉంటే ఒక్కొక్కరికీ రూ.3 లక్షలు ఇస్తామంటూ అడ్వాన్స్ గా లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. ఒకవేళ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే అందరినీ చంపేస్తామని బెదిరించారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు సాక్షులను ప్రశ్నించగా అనంతబాబు అనుచరులు తమని కిడ్నాప్ చేశారని చెప్పారు. వారు ఇచ్చిన డబ్బుని కూడా పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అనంతబాబు, అనుచరులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
అనంతబాబు షరతులు ఉల్లంఘించినందున ఆయన బెయిల్ రద్దు చేయాలని రాజమహేంద్రవరం కోర్టుని కోరారు. ఆ కేసు విచారణకు హాజరై అనంతబాబు తిరిగి వెళుతున్నప్పుడు పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ మూడు శాంపిల్స్ చూస్తే డీఎన్ఏ మ్యాచింగ్ అయ్యిందని అర్ధమవుతోంది కదా?




