“మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ మనమే” అని వైసీపీ శ్రేణులకు వారి అధినేత జగన్ భరోసా ఇస్తున్నారు. కానీ మహిళా రిజర్వేషన్స్, డీలిమిటేషన్, సర్ ఈ మూడూ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేయబోతున్నాయి.
ఈ మూడు కాక కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల మద్య నానాటికీ బలపడుతున్న ఐక్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు, అమరావతి, ఏపీలో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు, జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు, మళ్ళీ ఈవీఎంలతోనే ఎన్నికలు, అమరావతిని వ్యతిరేకిస్తూ జగన్ మావిగన్ ప్రతిపాదన వంటివన్నీ వచ్చే ఎన్నికలలో వైసీపీకి ప్రతికూలాంశాలే.
కనుక ఈ వాస్తవ పరిస్థితులన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే 175/175లాగే ‘మళ్ళీ మనమే’ కూడా ఓ పగటి కలగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ వాస్తవాలను, వీటి భవిష్యత్ పర్యవసానాలను వైసీపీలో ఎవరూ చూడొద్దనే జగన్ అందరినీ మూడేళ్ళు కళ్ళు మూసుకోమంటున్నారేమో? అని అనుమానం కలుగుతుంది.
వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎటువంటి గండాలు పొంచి ఉన్నాయో ఓసారి చూద్దాం! ముందుగా అలా పశ్చిమ బెంగాల్ తిరిగొద్దాం.
ఈ నెల 23,29న పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమీషన్ ‘సర్’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) పేరుతో ఏకంగా 90.83 లక్షల ఓటర్లని జాబితాలో నుంచి తొలగించేసింది!
వీటిలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు వచ్చి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలతో ఆధార, రేషన్ ఓటర్ కార్డులు సంపాదించుకున్నవారే ఎక్కువ మంది ఉన్నారు.
సర్ దెబ్బతో వారి ఓట్లన్నీ పోయాయి. దీంతో ఈసారి తృణమూల్ ఓటమి ఖాయమని లేదా ప్రభుత్వ ఏర్పాటుకి తగినన్ని సీట్లు సాధించుకోవడానికి చాలా ఎదురీదవలసి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఏపీలో ఎన్డీయే(కూటమి) ప్రభుత్వమే ఉంది. కనుక ఇక్కడ కూడా ‘సర్’ పేరుతో వైసీపీ మద్దతుదారుల పేర్లు జాబితాలలో నుంచి తొలగించే ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన చెందుతోంది. కనుక బూత్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఓటర్ల జాబితాలలో తమ ఓటర్ల పేర్లు తొలగించకుండా నేతలకు బాధ్యతలు అప్పగించింది.
కానీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంతగా అడ్డుకున్నప్పటికీ ఏకంగా90.83 లక్షల ఓటర్లని జాబితాలో నుంచి తొలగించేసినప్పుడు, వైసీపీ అడ్డుకుంటే ఏపీలో ఓట్లు తొలగించలేదా? కనుక వైసీపీకి ‘సర్’ గండం పొంచి ఉందని అర్ధమవుతోంది.
వైసీపీకి బలం ఉన్న నియోజకవర్గాలను డీలిమిటేషన్ పేరుతో విడదీస్తే చాలు ఆ పార్టీ పరిస్థితి తారుమారవుతుంది. వచ్చే ఎన్నికలలోనే 33 శాతం మహిళా రిజర్వేషన్స్ కూడా అమలుచేయాల్సి ఉంటుంది.
వైసీపీలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి బలమైన నాయకులున్న నియోజకవర్గాలను డీలిమిటేషన్ ద్వారా విడగొట్టి, వాటిలో మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సీట్లు దక్కేలా మార్పులు చేర్పులు చేస్తే వైసీపీలో సీనియర్లందరి పరిస్థితి ఏమవుతుందో వేరే చెప్పక్కరలేదు.
గత ఎన్నికలలో ఈవీఎంల వల్లనే ఓడిపోయామని జగన్ చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా అవే ఈవీఎంలతో ఎన్నికలు జరుగుతాయి. జగన్ చెప్పిన కారణం నిజమే అయితే వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీకి ఓటమి తప్పదు కదా?
పార్టీలో నేతలు, కార్యకర్తలు ఈ నిజాలన్నీ చూసి తీవ్ర ఆందోళన చెండుతారానే జగన్ అందరినీ మూడేళ్ళు కళ్ళు మూసుకోమంటున్నారా?




