వైసీపీకి అన్నీ చెడు శకునాలే?

YSRCP facing political challenges ahead of Andhra Pradesh elections with alliance pressure

ఓ పక్క కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం, మూలపేట, రామాయంపేట పోర్టులు నిర్మింపజేస్తూ, పలు పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఏపీకి రప్పిస్తూ వచ్చే ఎన్నికలలో వాటన్నిటినీ చూపి ఓట్లు అడగబోతోంది.

మరో ముఖ్య విషయం ఏమిటంటే, గత ఎన్నికల నాటికి టీడీపి-జనసేన పొత్తులపై జనానికి కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కానీ వాటిని భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ ఈ రెండేళ్ళలో వాటి మద్య బంధం చాలా బలపడింది. రెండు పార్టీలు చక్కగా కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. కనుక ఈసారి వాటి పొత్తులపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉండవు. దీని వలన వాటి విజయావకాశాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కానీ వైసీపీ విషయానికి వస్తే, దాని అధినేత జగన్‌ అమరావతిని వ్యతిరేకిస్తూ మావిగన్‌ అంటున్నారు. ‘రప్పా రప్పా’ అంటూ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తూ దానికీ ప్రభుత్వాన్నే నిందిస్తుంటారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా ఎదురుదాడి చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.

ఇలా ప్రతీ విషయంలో ‘నెగెటివ్’గానే వ్యవహరిస్తూ అదే చాలా గొప్ప విషయమన్నట్లు, ఇలాంటి నెగెటివ్ వైఖరితోనే వచ్చే ఎన్నికలలో అలవోకగా విజయం సాధించగలమని నమ్ముతున్నారు. ఎలాగో ఆయనకే తెలియాలి. వైసీపీ నేతలు కూడా అధినేత చెప్పినట్లు గుడ్డిగా ముందుకు సాగిపోతున్నారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీని ప్రజలు ఎందుకు గెలిపిస్తారో? ఏవిధంగా గెలవగలదో జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ చెప్పరు. కానీ ‘తప్పకుండా మళ్ళీ మనమే… వస్తే రప్పా రప్పా..’ అని క్యాడర్‌ని ఉత్సాహపరుస్తుంటారు.

అయితే వాస్తవ పరిస్థితి ఏమిటో జగన్‌కు తెలియదనుకోలేము. టీడీపి-జనసేనల పొత్తుతో వైసీపీకి ప్రమాదముందని అందరి కంటే ముందే పసిగట్టారు జగన్‌! కనుక వాటిని దూరంగా ఉంచేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. చివరికి జగన్‌ అంచనాలు, భయాలే నిజమయ్యాయి. అప్పుడు వైసీపీ ఓటమిని ఈవీఎంల పద్దులో వ్రాసేసి చేతులు దులుపుకున్నారు. ఓకే!

కానీ వచ్చే ఎన్నికలు కూడా అవే ఈవీఎంలతో జరుగుతాయి కదా?మరి గెలుస్తామని ఎలా చెపుతున్నారు? ఇదివరకు వైసీపీ శ్రేణులను 175/175 అంటూ మభ్య పెట్టినట్లు, మళ్ళీ ఓడిపోతామని జగన్‌కు తెలిసి ఉన్నా పార్టీ శ్రేణులను మళ్ళీ మభ్యపెడుతున్నారా? అనే సందేహం కలుగుతుంది.

వైసీపీకి అన్నీ వ్యతిరేక పరిస్థితులే కనిపిస్తున్న ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల కమీషన్ ‘సర్’ పేరుతో ఏపీలో కూడా ఓటర్ల జాబితా సవరణ చేపట్టబోతోంది.

ఈ పేరుతో బిజేపి, ఎన్డీయేని వ్యతిరేకించేవారి ఓట్లన్నీ ఏరిపారేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అది నిజమో కాదో తెలీదు కానీ ఇప్పుడు ఏపీలో ఓటర్ల జాబితా సవరణ జరగబోతోంది. అంటే వైసీపీకి మరో పెను ప్రమాదం పొంచి ఉందన్న మాట!

కనుక వెంటనే బూత్ లెవెల్ నాయకులు, ఇన్ ఛార్జ్ నియామకాలు మొదలుపెట్టింది. మరి ఈ అప్రమత్తత వైసీపీని కాపాడుతుందా? లేక వైసీపీ భయాలు మళ్ళీ నిజమవుతాయా?

ADVERTISEMENT
Latest Stories