2024 ఎన్నికలలో 151 సీట్లతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ వై నాట్ 175 అంటూ తొడలు కొట్టింది. కట్ చేస్తే 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాబట్టుకోలేనంత స్థాయిలో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే వైసీపీ అపజయాన్ని, జగన్ పరభావాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కూటమి గెలుపుని తగ్గించే ప్రణాళికలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు.
ఈవీఎంల ట్యాపరింగ్ ఫలితంగానే ఏపీలో కూటమి ఆ స్థాయి విజయాన్ని అందుకోగలిగిందని, బాబు, పవన్ ల గెలుపు అప్రజాస్వామ్యం అంటూ వైసీపీ తన ఘోర ఓటమికి కుంటిసాకులు వెతికింది. అవే నిజమని నమ్మించే ప్రయత్నం చేసింది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సీఎం గా జగన్ అప్పులు చేసి మరి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాడని, బటన్లు నొక్కి నేరుగా లబ్ది దారుల ఖాతాలలోనే నగదు జమ చేసాడని,
అలాంటి జగన్ ఇలా ఎలా ఓడిపోతారంటూ వైసీపీ కార్యకర్తల నుంచి వైసీపీ అధినేత జగన్ వరకు తమ అపజయాన్నీ ఈవీఎంల మీద నెట్టేసి తమ తప్పులను కప్పిపుచ్చుకోవాలని చుసారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ పవన్ టీడీపీ, బీజేపీ లతో పొత్తు పెట్టుకుని వైసీపీ ఓటమే జనసేన అంతిమ లక్ష్యం అన్నట్టుగా కూటమిగా ముందుకెళ్లారు.
ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం గంపగుత్తగా కూటమి ఖాతాలో పడింది. దీనితో వైసీపీ 11 తో సరిపెట్టుకుంటే కూటమి 164 సీట్లతో ఎవరు ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే ఇక్కడ కూటమి విజయాన్ని ఒప్పుకోలేని వైసీపీ, తమిళనాడులో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకి 108 సీట్లతో తమిళనాట అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన విజయ్ టీవీకే పార్టీ గెలుపును అభినందిస్తున్నారు.
ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి సాధించిన విజయాన్ని ఈవీఎంలకు ఆపాదిస్తూ ఆ గెలుపుని తగ్గించిన వైసీపీ ఇప్పుడు విజయ్ టీవీకే గెలుపు లో మాత్రం ఈవీఎంల ప్రస్తావన తేలేకపోతుంది వై.? వైసీపీ ఓటమికి కూటమి గెలుపుకి ఈవీఎంలే కారణం అంటూ ఇప్పటికి గగ్గోలు పెడుతున్న వైసీపీ మరి తమిళనాడు ఎన్నికలలో ఈవీఎంల దోషం లేదని ఒప్పుకున్నట్టేనా.?
తమిళనాడులో విజయ్ గెలుపులో ఈవీఎంల పాత్ర లేదు అనేలా టీవీకే గెలుపు పై సంబరాలు చేస్తున్న వైసీపీ మరి వైసీపీ ఓటమిలో మాత్రం ఈవీఎంల పాత్ర ఉందని ఎలా చెప్పగలదు.? నిన్న మొన్నటి వరకు స్టాలిన్ ప్రభుత్వానికి తెరచాటు మిత్రుడిగా ఉన్న వైసీపీ ఇప్పుడు విజయ్ టీవీకే కి దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా.?
స్టాలిన్ డీఎంకే ప్రభుత్వానికి బహిరంగ మద్దతు తెలిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు విజయ్ టీవీకే గెలుపు పై ఈవీఎంల ప్రభావం అంటూ నిందలు వేయగలదా.? దేశంలో ఎక్కడ లేని ఈవీఎంల ప్రభావం ఏపీలో ఒక్క వైసీపీ ఓటమిలో మాత్రమే ప్రభావం చూపించిందని వైసీపీ చెప్పదలచుకుంటుందా.? ప్రజలను నమ్మించదలిచిందా.?
నేడు విజయ్ గెలుపుని ఆస్వాదిస్తున్న వైసీపీ నాటి వైసీపీ ఓటమిని అంగీకరించగలగాలి. అలాకాకుండా టీవీకే గెలుపు సింహం సింగల్, వైసీపీ ఓటమి ఈవీఎంల దోషం అంటూ ఇంకా అదే నినాదంతో ముందుకెళితే చివరికి ప్రజల ముందు వైసీపీ నేతలే రాజకీయంగా మరింత పలుచనవుతారు అనేది గ్రహించాలి.




