వైసీపీ కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా లిక్కర్ తయారీ నుంచి శ్రీవారి లడ్డు ప్రసాద తయారీ నెయ్యి వరకు వైసీపీ ని కల్తీ కమ్మేసింది.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న మద్యం నకిలీ మద్యం అంటూ దాని వినియోగం తో మందుబాబుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయంటూ అప్పటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.
అలాగే నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడే నెయ్యిని కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందంటూ ఆరోపించింది, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది.
అయితే ఈ అంశం పై విచారణ జరిపిన సిబిఐ తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది.
అయితే ఈ నెల 13 లేదా 15 తేదీలలో విచారణకు హాజరవుతానంటూ వైవీ సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించినట్టు సిబిఐ ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే గుంటూరు రూరల్ లోని వెంగళాయపాలెం లో జరిగిన వాటర్ షెడ్ ప్రారంభ సభలో గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన మందు కల్తీ, మాట కల్తీ, మనసు కల్తీ, మొత్తం మనిషి కూడా కల్తీనే అంటూ మండిపడ్డారు.
అయితే టీడీపీ నేతల విమర్శలకు తగ్గట్టే వైసీపీ కూడా రాజధాని అమరావతి నుంచి పోలవరం వరకు, విశాఖ గూగుల్ సెంటర్ ఏర్పాటు నుంచి రాజధానిలో వరదల వరకు, తిరుమల వంటి పుణ్య క్షేత్రాల నుంచి ప్రకృతి విపత్తుల వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు చేస్తూ నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుంది.
దీనితో వైసీపీ రాజకీయాన్ని మొత్తం కల్తీ కమ్మేసిందా.? అంటూ ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






