వైసీపీ రాజకీయం ఎలా ఉంటుంది, ఆ రాజకీయాన్ని తన పార్టీకి అనుకూలంగా చేసుకోవడానికి జగన్ ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టడానికి ఎటువంటి ప్రచారాలను ఎంచుకుంటారు అని తెలుసుకోవడానికి ఇప్పటికే వైసీపీ చరిత్రలో ఎన్నో కుల రాజకీయ విద్వేషాలు, మత రాజకీయ ఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి.
వాటిలో ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ అనుసరించిన, అనుసరిస్తున్న కుల రాజకీయ విద్వేషాల గురించి ఒక్కసారి గతాన్ని తవ్వి చూద్దాం, వర్తమానాన్ని విశ్లేషిద్దాం. వైసీపీ ప్రతిపక్షంలో ఉందంటే ఏపీలో కుల రాజకీయ చిచ్చులు రాజుకున్నట్టే, ఆ చిచ్చులో వైసీపీ రాజకీయ లబ్ది పొందడానికి టీడీపీ బలిపీఠం ఎక్కాల్సిందే అనేలా వైసీపీ తన వ్యూహాలను సిద్ధం చేస్తుంది, అలాగే అమలు కూడా చేస్తుంది.
2014 అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన తుని ఘటన యావత్ కాపు కులానికి ముడి పెట్టి దాని ద్వారా తన పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చుకుంది వైసీపీ. అలాగే ఆ ఘటనలో ముద్రగడను అడ్డుపెట్టుకుని వైసీపీ తన ప్రచారాలతో టీడీపీ ని దోషిగా కూడా చిత్రీకరించగలిగింది.
2016 జనవరి 31 న తూర్పు గోదావరిలోని తుని కేంద్రంగా ముద్రగడ నేతృత్వంలో కాపు గర్జన సభ ఏర్పాటు చేసారు .అయితే కాపు గర్జన పేరుతో జరిగిన సభ కాస్త రైల్వే స్టేషన్ల మీద దాడి, ఆ పై రత్నాచల్ రైలు దగ్ధం వరకు వెళ్ళింది. ఆ దుర్ఘటనకు బాధ్యుడిగా ముద్రగడ పై కేసులు నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వం.
ఆ కేసులే వైసీపీ కుల రాజకీయానికి అస్త్రాలుగా మారాయి. ముద్రగడ కు మద్దతుగా నాడు జగన్ కదిపిన రాజకీయ పావులు కాపు సామాజికవర్గం దృష్టిని ఆకర్షించాయి. ముద్రగడ పై ప్రభుత్వం పెట్టిన కేసులను కాపు కులం మీద టీడీపీ దాడిగా చిత్రీకరించారు, అలాగే ముద్రగడ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది కాపు సమాజం పై బాబు కక్ష్య రాజకీయంగా ప్రచారం చేసారు.
అలా ముద్రగడ పేరుతో వైసీపీ మొదలుపెట్టిన కుల రాజకీయానికి నాడు టీడీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు కూడా వైసీపీ అదే స్టాటజీని తెరమీదకు తెచ్చి అంబటి వివాదానికి కాపు రాజకీయాన్ని జోడిస్తుంది. వైసీపీ ఆడుతున్న ఈ కుల రాజకీయానికి నాడు ముద్రగడ ను ఆయుధంగా చేసుకుంటే నేడు అంబటిని అస్త్రంగా వాడుతుంది.
ఒక మాజీ మంత్రి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత దారుణమైన పదజాలంతో బూతులు తిడితే పార్టీ అధినేతగా అటువంటి భాషను ఖండించాల్సిన జగన్ అందులో తప్పేముంది అంటూ వారిస్తూ, వ్యక్తి గొడవను కుల గొడవగా చిత్రీకరిస్తున్నారు.
నాడు ముద్రగడ తుని ఘటనను, నేడు గుంటూరు అంబటి వ్యవహారాన్ని తనకు, తన పార్టీకి అనుకూలంగా మలిచేందుకు వైసీపీ కుల రాజకీయ గొడవలకు భీజాలు వేస్తుంది. కాపు కులాల్ని ఆ రొచ్చులోకి లాగుతుంది. కాపులంటే బాబుకెందుకింత కక్ష్య.? కాపు సామాజికవర్గం నేతల మీద టీడీపీ దాడులేంటి.?
నాడు ముద్రగడ, నేడు అంబటి టీడీపీ కక్ష్య రాజకీయానికి బలికావాల్సిందేనా అంటూ ఒక వివాదానికి కుల రంగు అద్దుతుంది వైసీపీ. తుని ఘటనతో తన వ్యూహాలు ఫలించడంతో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క పక్కా ప్రణాళికతో వైసీపీ ఈ రకమైన రాజకీయాలకు తెరలేపుతుంది.
తమ పార్టీ నేతల రెచ్చకొట్టే వ్యాఖ్యలతో టీడీపీ రెచ్చిపోతే రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు సృష్టించి ఆ నేరాన్ని టీడీపీ పై మోపి, ఆ పాపానికి బాబే కారణమంటూ నింద బాబు మీద నెట్టేయడం వైసీపీ రాజకీయ అలవాటులో భాగమయ్యింది. అందులో భాగంగానే నేడు వైసీపీ కాపు నేతలందరూ అంబటి ఇంటికి పరామర్శ యాత్ర మొదలుపెట్టారు.
దీనితో కాపులంతా జగన్ వెంటే ఉన్నారు, టీడీపీ చర్యలను ఖండిస్తున్నారు, బాబు వైఖరిని వేలెత్తి చూపుతున్నారు అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెడుతుంది. అయితే ఒక వివాదాన్ని తమను అనుకులంగా ఎలా కుల రాజకీయాలు చేయాలి అనేదాని మీద వైసీపీ కి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఈ రాజకీయంలో ఒకసారి దెబ్బ తిన్న టీడీపీ కి ఇంకెంత క్లారిటీ ఉండాలి.? మరి ఉందా.? ఉంటె ఆ దిశగా అడుగులెందుకు పడడంలేదు.?
వైసీపీ ప్రచారాన్ని బలంగా ఎందుకు తిప్పికొట్టలేకపోతుంది.? టీడీపీ లో కాపు నేతలకు కోరవా.? వారందరు ఆ బాధ్యతను తమ భుజాన ఎందుకు వేసుకోవడం లేదు.? కాపు సామాజికవర్గం మెండుగా ఉన్న గోదావరి జిల్లాలో కూటమికి అంత పట్టున్నప్పటికీ ఆ పట్టుని తమ బలంగా ఎందుకు ప్రదర్శించుకోలేకపోతుంది.? ఇంకెన్నాళ్లు వైసీపీ కాపు రాజకీయ మంటలలో టీడీపీ కాలిపోతుంది.
నాటి రంగా నుంచి నిన్న ముద్రగడ, నేడు అంబటి వరకు టీడీపీ, వైసీపీ వేస్తున్న ఇన్ని కుల నిందలు ఎందుకు మోయాలి.? రంగా కుమారుడు రాధా టీడీపీ పార్టీలోనే ఉంటున్నా, ముద్రగడ కుమార్తె కూటమి పొత్తులోనే ఉన్నా,
అంబటి వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి బాబే బాధితుడిగా మారినా వైసీపీ టీడీపీ నే దోషి అంటూ ఎలా ప్రచారం చేయగలుగుతుంది.? దీనికంతటికి బాబే మూలం అంటూ ఎలా కథనాలు వండి వడ్డించగలుగుతుంది.? ఇది వైసీపీ బరితెగింపుగా చూడాలా.? లేదా టీడీపీ అలసత్వంగా భావించాలా.?






