తాడేపల్లి ప్యాలస్ నుంచి ఒక లైన్ వస్తుంది. వైసీపీ నేతలందరూ ఆ లైన్ పట్టుకొని మాట్లాడుతుంటారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కనుక ప్యాలస్ నుంచి మళ్ళీ ఓ లైన్ వచ్చింది. “కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదు గాబట్టి… దౌర్జన్యాలు చేసి ఎన్నికలలో గెలవాలనుకుంటోంది,” అని జగన్ చెప్తున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న మాజీ మంత్రి రోజా కూడా నేడు బయటకు వచ్చి అదే చెప్పారు.
ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? ఏం తెచ్చారు?అంటే సంక్షేమ పధకాల రికార్డ్ వేస్తుంటారు తప్ప “ఫలానా పని పూర్తి చేశాము… ఫలానా పరిశ్రమని తెచ్చాము… ఇన్ని డీఎస్సీలు తీసి ఇన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశాము..” అని చెప్పుకోలేరు.
కనీసం తాము స్వయంగా ప్రతిపాదించిన మూడు రాజధానులు, విశాఖ రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయారు.
రివర్స్ టెండర్లతో పోలవరానికి బ్రేకులు వేసి, అమరావతిని పాడు బెట్టేశారు. చివరికి అన్నా క్యాంటీన్లను కూడా మూయించేశారు. వెళ్తూ వెళ్తూ సుమారు రెండు లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేసి పోయారు.
ఏమీ చేయకుండానే ఐదేళ్ళు కాలక్షేపం చేసి దిగిపోయిన వైసీపీ, తాము చేయలేక చేతులెత్తేసిన అమరావతి, పోలవరం, వెలిగొండ, భోగాపురం ఎయిర్ పోర్ట్ వంటివి పూర్తిచేస్తుంటే, ‘కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు కనుక…’ అని చులకనగా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 15,941 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే, ఐదేళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా తీయని జగన్, దానినీ తప్పు పడుతూ ఆందోళనలు చేయిస్తూ, శాసనసభకు రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్మీట్ పెట్టి సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రి నారా లోకేష్లను ఉద్దేశ్యించి “అబ్బాకొడుకులు…’ అంటూ చాలా చులకనగా మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలను చూసి వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నారు కనుకనే ఇప్పటి నుంచే ”చంద్రబాబు నాయుడు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనీయడు.. దౌర్జన్యాలు చేయిస్తాడు..” అంటూ ఓటమికి ముందే సాకులు సిద్ధం చేసి అందరూ కలిసి రికార్డ్ వేస్తున్నారు. ఇది ఎన్నికలు పూర్తయ్యే వరకు వినిపిస్తూనే ఉంటుంది.
కానీ కేవలం రెండేళ్ళలో ఇన్ని పనులు పూర్తిచేసి, ఇంకా అనేకం చేయబోతున్న సిఎం చంద్రబాబు నాయుడు, తర్వాత జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో మేయర్, చైర్ పర్సన్ పదవులకి ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలనుకోవడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమే కదా?
Policeలను అడ్డుపెట్టుకుని Local Body Elections గెలవాలనుకుంటున్నారు!
–@RojaSelvamaniRK #YSRCP pic.twitter.com/9hr8EW7qL5
— M9 NEWS (@M9News_) August 25, 2026





