ఇంకా జగన్‌ని నమ్ముకొని ఉందామా… బయటపడదామా?

ys-jagan-

యుద్ధం… సిద్దం… అంటూ ఉత్తర కుమారుడిలా అన్నేసి ప్రగల్భాలు పలికి ఎన్నికలలో ఓడిపోవడంతోనే జగన్‌ నవ్వులపాలయ్యారు. కానీ ఆ షాక్ నుంచి తేరుకొని మళ్ళీ టిడిపి కూటమి ప్రభుత్వంతో పోరాటాలు మొదలుపెట్టగానే ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం, ఇప్పుడు ఈ ఆస్తుల గొడవలతో జగన్‌ గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతోంది. విజయమ్మ లేఖతో జగన్‌ని నడిబజారులో బట్టలూడదీసి నిలబెట్టిన్నట్లే అయ్యింది.

వారి మద్య జరుగుతున్న ఈ ఆస్తి తగాదాలు వాటికే పరిమితం అయ్యేవి కావు… జగన్‌ బెయిల్‌ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉందని వైసీపియే చెప్పుకుంటోంది. కనుక జగన్‌ తీరుతో వైసీపికి రాజకీయంగా జరుగుతున్న నష్టం సరిపోదన్నట్లు, జగన్ బెయిల్‌ రద్దు ప్రస్తావన స్వయంగా చేసుకోవడంతో వైసీపిలో కలకలం మొదలైంది.

ADVERTISEMENT

వైసీపిలో కొందరు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో ఇద్దరు టిడిపిలోకి, నలుగురు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం.

ఎన్నికలలో గెలుపోటములు సహజమే అని సరిపెట్టుకొని ఇంతకాలం జగన్‌ని నమ్ముకుని కొందరున్నారు. కానీ ఇప్పుడు జగన్‌ తీరు వలన వైసీపిపై ప్రజలలో దురాభిప్రాయం మరింత బలపడుతుంది. పైగా ఈ ఆస్తుల గొడవల నుంచి జగన్‌ ఏదోవిదంగా బయటపడినా ఆ తర్వాత మళ్ళీ మరేదో అనూహ్య పరిణామాలు జరుగక మానవు.

కనుక ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న జగన్‌ వెంట ఉంటూ నష్టపోవడం కంటే పార్టీ నుంచి బయటపడటమే మేలని పలువురు వైసీపి నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

అలాగని కాంగ్రెస్‌లో చేరినా వైఎస్ షర్మిలని తట్టుకోవడం కష్టం. ఆమెతో కలిసి జగన్‌తో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం టిడిపి, జనసేనల నేతలని, కార్యకర్తలని రాజకీయంగా వేధించి, వారి అధినేతలని నోటికి వచ్చిన్నట్లు తిట్టిపోసినందున, ఇప్పుడు ఆ పార్టీలలో ప్రవేశం లభించడం చాలా కష్టమే.

కానీ అవే అధికారంలో ఉన్నాయి కనుక ఇదివరకే వాటిలో చేరిన వైసీపి నేతల ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఒప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వారు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే త్వరలోనే వైసీపి నుంచి వలసలు మొదలయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories