ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నేతలు హడలిపోయారు. ఇక తమకి దినదిన గండమే అనుకున్నారు. వారిలో నంబర్: 1గా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి ఏకంగా గుండెపోటు తెచ్చుకొని బైపాస్ చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు ఓ 4-5 నెలలు అందరూ సైలంట్ అయిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం గాండ్రింపులే తప్ప తమని ఏమీ చేయలేదని గ్రహించినప్పటి నుంచి వారే ప్రభుత్వాన్ని ‘రప్పా రప్పా’ అని బెదిరిస్తున్నారు.
గోదాముల్లో బియ్యం మాయం కేసులో పేర్ని నాని, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఇలా ఒక్కో కేసులో ఒక్కొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ కేసులో హడావుడే తప్ప ఏమీ జరగలేదు. అందువల్లే ఇప్పుడు “నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గుట్టు రట్టు.. ఈ కేసుని విచారిస్తున్న సిట్ ఆయన పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిందని,” మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
జోగి రమేష్కి కూడా ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో బాగా తెలుసు. కనుక ఆయన కూడా ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ఆయన తరపు న్యాయవాదులు అప్పుడే ‘ముందస్తు సన్నాహాలు’ చేసుకుంటున్నారు.
కనుక ఈ కేసులో సిట్ అధికారులు ఒకవేళ ఆయనని అరెస్ట్ చేసినా, మిగిలిన కేసుల్లో జైలుకి వెళ్ళిన వైసీపీ నేతలందరూ ఏవిధంగా బయటపడ్డారో అలాగే జోగి రమేష్ కూడా బయటపడతారు.
కేసులు-జైలు-బెయిలు స్టోరీలో వైసీపీ నేతలందరికీ ఇంత క్లారిటీ ఉంది కనుకనే ఈ కేసులను తాటాకు చప్పుళ్ళతో పోలుస్తున్నారు. అందుకే రప్పారప్పా అంటున్నారు. కానీ వారి విషయంలో కూటమి ప్రభుత్వానికి క్లారిటీ ఉందో లేదో తెలీదు.






