వక్ఫ్ చట్ట సవరణ బిల్లు-2025కి పార్లమెంట్ ఆమోదం లభించినందున త్వరలోనే రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా అమలులోకి రాబోతోంది.
ఇదే జరుగబోతోందని ముందే ఊహించిన వైసీపీ పార్లమెంటులో ఈ బిల్లుని వ్యతిరేకించింది. తద్వారా తాము ముస్లింలకు అండగా నిలబడ్డామని, టీడీపీ, జనసేనలు ముస్లింల ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ బిల్లుకి మద్దతు ఇచ్చాయని ఇప్పటికే వైసీపీ ప్రచారం మొదలుపెట్టేసింది.
జగన్ రిస్క్ తీసుకొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయించారు కనుక ఇక్కడితో ఊరుకుంటే వైసీపీ ఆశించిన ప్రయోజనం లభించదు.
కనుక నేడు గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నేడు బ్రహ్మానంద స్టేడియం వద్ద నిరసనలు తెలిపేందుకు కులమతాలకు అతీతం అందరూ కలిసి రావాలని వైసీపీ పిలుపునిచ్చింది.
కానీ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు మోడీ ప్రభుత్వాన్ని నిందించి ఊరుకోరు. ఈ పేరుతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించడమే వారి ప్రధాన ఉద్దేశ్యమని వారు చేయబోయే విమర్శలతో స్పష్టమవుతుంది.
వక్ఫ్ బిల్లు యావత్ దేశానికి సంబందించింది. కనుక దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ ధర్నాలు, దీక్షలు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. కానీ ఒక్క గుంటూరులో మాత్రమే చేస్తోంది. ఎందుకు?అంటే రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం అదే కనుక!
అంటే ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం వైసీపీ ప్రధానోద్దేశ్యం కాదని, ఈ పేరుతో ధర్నాలు, దీక్షలు చేసి రాష్ట్రంలో ముస్లింలను ఆకట్టుకొని తమవైపు తిప్పుకోవాలనే తాపత్రయ పడుతోందని స్పష్టమవుతోంది.
సంక్షేమ పధకాలకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసి పంచిపెట్టి వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకున్నారు జగన్. అదేవిదంగా విశాఖ రాజధాని, మద్యపాన నిషేధం పేరుతో కూడా పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చారు.
అవి సమైక్యాంధ్ర ఉద్యమాలు కావచ్చు.. ప్రత్యేక హోదా ఉద్యమాలు కావచ్చు… వైసీపీ ఎప్పుడు ఏ పని చేసినా దానిలో నిజాయితీ, నిబద్దత రెండూ ఉండవు. ఇప్పుడు వక్ఫ్ పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయాలు కూడా అటువంటివే.




