సొంత మీడియా చేతిలో ఉంటే ఎన్ని రాతలైన రాసుకోవచ్చు.. ఎలాగైనా రాసుకోవచ్చు. మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాలంటూ వైసీపీ రోడ్లపై హడావుడి చేస్తుంటే, మరోపక్క దాని సొంత మీడియాలో ఏపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ అనేక కధనాలు వండి వార్చేసింది. ఆ తర్వాత జగన్ ఆ కాగితాల కట్టలని గవర్నర్ చేతిలో పెట్టి వచ్చేశారు.
ఇవన్నీ చేతిలో పనులే కనుక అన్నీ ప్లాన్ ప్రకారం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
పిపిపి పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ కొరకు టెండర్ల ప్రక్రియని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరింది.
దీనిలో ఏపీ ప్రభుత్వం, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ ఎంఎస్ఐడీసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ని ప్రతివాదులుగా పేర్కొంది. ఇదివరకు దాఖలు చేసిన అన్ని పిటిషన్లతో కలిపి దీనినీ విచారిస్తామని హైకోర్టు తెలియజేసింది.
ఈ అంశంపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేయడం చాలా మంచిదే. ఎందుకంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్పష్టం చేసింది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు, నర్సింగ్ సీట్లు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం విధానానికి అనుకూలంగానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ పిపిపి విధానానికి పూర్తిగా ప్రైవేటీకరణకు చాలా తేడా ఉందనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు, పిపిపి అంటే ప్రైవేటీకరణ అంటూ వైసీపీ వితండవాదం చేస్తోంది. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ టెండర్లు రద్దు చేస్తే విజయోత్సవాలు చేసుకోవచ్చని వైసీపీ ఈ పిటిషన్ వేసింది.
మెడికల్ కాలేజీలు పిపిపి పద్దతిలో నిర్మించి, నిర్వహించాలనుకోవడం రాజ్యాంగ విరుద్దం కాదు. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా పిపిపి విధానం అనుసరించమని చెపుతోంది. కనుక ఈ అంశంపై వైసీపీ హైకోర్టుకి వెళ్ళడం చాలా మంచిదే, అక్కడ గట్టిగా మొట్టికాయలు పడితేగానీ దానికి ఈ మెడికల్ రోగం తగ్గదు.






