ప్రతీ రాజకీయ పార్టీకి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందుకోసం అవి ప్రజలు, రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేస్తుంటాయి.
తద్వారా ప్రజలకు దగ్గరయ్యి వారి ఓట్లతో అధికారంలోకి రావాలనుకుంటాయి. అదే సమయంలో అధికార పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంటాయి. దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఈవిధంగానే రాజకీయాలు చేస్తూ ఉంటాయి… ఒక్క వైసీపీ తప్ప!
అలాగని వైసీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేయడం లేదని కాదు. నిత్యం చేస్తూనే ఉంటుంది. కానీ దాని పోరాటాలలో నిజాయితీ కనిపించదు. ప్రతీ దానిలో ఏదో ఒక వ్యూహం కనిపిస్తుంటుంది.
నాడు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమాలు, ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్షలు మొదలు నేడు పెట్రోల్ డీజిల్ కొరత నిరసనల వరకు దేనిలో కూడా నిజాయితీ, నిబద్దత కనిపించదు. వాటి అర్ధాలు, పరమార్ధాలు వేర్వేరుగా ఉంటాయి.
కూటమి ప్రభుత్వంపై చేసే పోరాటాలలో నిబద్దత, నిజాయితీ లేదు సరే! కనీసం వైసీపీని ఎన్నికలలో గెలిపించుకొని మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచన, ప్రయత్నాలలో కూడా నిబద్దత కనబడదు. ఇది విడ్డూరమే కదా?
ఒకవేళ జగన్కు ఆ నిబద్దత ఉండి ఉంటే జగన్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే వారు. ప్యాలస్ రాజకీయాలు మానుకొని ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలపై పోరాడుతూ ఉండేవారు.
ప్రజల ఆకాంక్షలకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిర్మితమవుతున్న భవ్యమైన రాజధాని అమరావతిని వ్యతిరేకించేవారు కారు.
కూటమి ప్రభుత్వం నానాటికీ బలపడుతోందని గ్రహించినప్పుడు వైసీపీని కూడా బలోపేతం చేసుకునేవారు. సింగిల్ సింహం ఒంటరిగా సింహాల గుంపుని ఎదుర్కోలేదని గ్రహించినప్పుడు తనకు తోడుగా నిలిచే తల్లిని, చెల్లిని, విజయసాయి రెడ్డి వంటివారిని దూరం చేసుకునే వారు కారు. తలపై కత్తిలా కేసులు వ్రేలాడుతున్నప్పుడు నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరించేవారు కాదు.
కానీ రోజుకో కొత్త వ్యూహంతో అధికార పార్టీని ముప్పతిప్పలు పెడుతుండటమే చాలా గొప్ప విషయమన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రతీరోజు సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తూ, సొంత మీడియా, సోషల్ మీడియాలో ఆయనని రాక్షసుడిగా చిత్రీకరిస్తూ బొమ్మలు వేసుకొని, దుష్ప్రచారం చేస్తూ అదే గొప్ప రాజకీయమని జగన్ అనుకుంటునట్లున్నారు.
జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా ప్రతీరోజూ ప్రధాని మోడీపై దుమ్మెత్తి పోయడమే గొప్ప రాజకీయమనుకుంటారు. ఆయనని ఆ భ్రమలో ఉంచుతూనే ప్రధాని మోడీ 12 ఏళ్ళు అధికారంలో కొనసాగుతున్నారు. మరో పదేళ్ళు ఇలాగే కొనసాగినా ఆశ్చర్యం లేదు.
జగన్ తీరు, ఆలోచనా విధానం మారనంత వరకు ఆయన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. జగన్ చూస్తుండగానే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రులో కేంద్ర మంత్రులో కూడా అవుతారు.




