జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటున్నా… కేంద్రానికే మద్దతు!

YSRCP Social Mediaఏపీ బిజెపి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై ఎదురుదాడి చేసేందుకు పోటీలు పడే వైసీపీ మంత్రులు, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేకపోతున్నారు. కనీసం స్పందించడం లేదు కూడా.

అంతకు ముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు వచ్చి జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని తీవ్ర విమర్శలు చేసినప్పుడూ మౌనం వహించారు! బిజెపి నేతలు తమ ప్రభుత్వాన్ని ఇంతగా విమర్శిస్తున్నా, వైసీపీ మాత్రం కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకే మొగ్గు చూపుతుండటం విశేషం!

ADVERTISEMENT

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకబిల్లులు ప్రవేశపెట్టబోతోంది. వాటన్నిటికీ వైసీపీ మద్దతు ఇస్తోంది.

ఢిల్లీ నుంచే బిజెపి దేశాన్ని పాలిస్తున్నప్పటికీ ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాత్రం ఆమాద్మీ పార్టీని ఓడించలేకపోతోంది. కనుక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని తన చెప్పు చేతలలో ఉంచుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కానీ న్యాయస్థానాలు బ్రేకులు వేస్తున్నాయి.

దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు కల్పించేందుకు మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఓ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. దానిని ‘ఇండియా’ కూటమి అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం అడగకుండానే ఆ బిల్లుకి వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్దపడింది!

అలాగే ‘ఇండియా’ కూటమి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు వైసీపీ సిద్దపడుతోంది. ఈ విషయంలోనూ తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీని ఎవరూ కోరలేదు. కానీ మద్దతు ఇస్తోంది!

అలాగే మోడీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) బిల్లుని కూడా ఇండియా వ్యతిరేకిస్తుంటే వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్దపడుతోంది. రాష్ట్రంలో ముస్లిం పెద్దలు సిఎం జగన్‌ను కలిసి దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ బిల్లుని వ్యతిరేకించలాని కోరిన సంగతి తెలిసిందే. కానీ ఆ బిల్లు ఆమోదం పొందేందుకు వైసీపీ సహకరించబోతోంది.

ఏవిదంగా అంటే రాజ్యసభలో ఈ బిల్లులన్నీ ఆమోదింపజేసుకొనేందుకు బిజెపికి తగినంత బలం లేదు. రాజ్యసభలో బిజెపికి 92, ఎన్డీయే సభ్యులు 17 మంది కలిపి మొత్తం 109 మంది ఉన్నారు. ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవాలంటే 119 మంది మద్దతు అవసరం. రాజ్యసభలో బిజెడీ, వైసీపీలకు కలిపి 9 మంది సభ్యులున్నారు. ఆ రెండు పార్టీలు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి.

ఏపీలో జనసేనతో కలిసి తమ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని బిజెపి చాలా స్పష్టంగా చెపుతున్నప్పటికీ, మోడీ ప్రభుత్వానికి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది?అంటే కారణాలు అందరికీ తెలిసినవే.

ADVERTISEMENT
Latest Stories