ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాలుపంచుకుని, వచ్చిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందుకు అనుగుణంగా చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.అలాగే బోళా శంకర్ సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్లో వైసీపీ నేతలను ఉద్దేశించి ఇచ్చిన చిరు సలహాలకు అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ మెగా స్టార్ స్థాయిని తగ్గించేలా ఉండడంతో చిరు ఫాన్స్ కూడా వైసీపీ నేతల పై ఫెయిర్ అయ్యారు.
రజనీకాంత్ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, వైసీపీ నేతలను ఉద్దేశించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఆయనకు చంద్రబాబు పై ఉన్న గౌరవాన్ని,అభిప్రాయాన్ని తెలుగు ప్రజలముందు వ్యక్తపరిచారు అంతే. అదే వైసీపీ నేతలకు రజని పై విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. కనీసం అయన వయస్సుకు కూడా మర్యాద ఇవ్వకుండా వైసీపీ నాయకులు చేసిన విమర్శలు పొరుగు రాష్ట్రాల ముందు ఏపీ రాజకీయాలు తలదించుకునే పరిస్థితికి దారితీసాయి.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభమైన మహా టీవీ వారి మహా మాక్స్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పలువురు సినీపరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకువచ్చిన రాజమౌళి తండ్రి, బాహుబలి కథ రచయితా విజయేంద్రప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం జరిగింది.అయితే అక్కడికి చీఫ్ గెస్ట్ గా హాజరైన పవన్ ను ఉద్దేశించి విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
పదవి అంటే దోచుకోవడం,దాచుకోవడం కాదని ప్రజాసేవ కోసమే అని భావించే నిజాయితీ కలిగిన నాయకుడు కావాలని, పవన్ మీకు ఆస్థాయిని అందుకునే అవకాశం ఉందని మీ ఆలోచనలను ఆచరణలో ఉంచి మతసామరస్యాలు లేని సమాజాన్ని సృష్టించాలని, అందుకు మీకు ఆదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అంటూ విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగాన్ని ముగించారు. ఏపీ లో ఉన్న ఏ ప్రతిపక్ష నేతను ప్రశంసించినా, వారు ఎంతటి వారైనా,ఏ స్థాయి వ్యక్తయిన ఉపేక్షించేది లేదంటూ వైసీపీ నేతలు తమ దిగజారుడు విమర్శలు మొదలుపెట్టడం సహజమే. అది సూపర్ స్టార్ అయినా మెగా స్టార్ అయినా చివరికి బాహుబలి సృష్టికర్త అయినా తమకు ఒక్కటే అంటారా? అనేది వేచి చూడాలి.




