రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ ప్రత్యర్థి పార్టీల అంతర్గత వ్యవహారాల మీద కూడా రాజకీయం నడిపిస్తుంది. తాజాగా టీడీపీ మూడు, జనసేన ఒక రాజ్యసభ సీటుకు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
అయితే ఇప్పుడు వైసీపీ ఆ రెండు పార్టీల రాజ్యసభ సీట్లకు కేటాయించిన అభ్యర్థులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెరలేపుతుంది. టీడీపీ తన పార్టీ నుంచి ఎవరిని రాజ్యసభకు పంపాలో, పవన్ తన పార్టీ తరుపున ఎవరికీ రాజ్యసభ సీటు కేటాయించాలని అనేది వైసీపీ సూచించడం హాస్యాస్పదంగా ఉంది.
జనసేన తనకొచ్చిన ఒక్క రాజ్యసభ సీటును కమ్మ సామాజికవర్గానికి చెందిన లింగమనేని రమేష్ కి కేటాయించడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. పవన్ జనసేన పార్టీ పెట్టింది కేవలం కమ్మ సామాజికవర్గం వారి పల్లకి మోయడానికేనా అంటూ విమర్శలు మొదలుపెట్టింది.
అలాగే లింగమేని జనసేన తరుపున రాజ్యసభ సీటు దక్కించుకున్నప్పటికీ ఆయన ఎంపిక బాబు నిర్ణయమే అంటూ జనసేన అంతర్గత నిర్ణయాల పై ఊహాజనిత ప్రచారాలకు శ్రీకారం చుట్టింది. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం శ్రమించిన నాయకులను పక్కన పెట్టి, బాబు నిర్ణయించిన అభ్యర్థికి ఓటేస్తున్నారు పవన్ అంటూ జనసేన క్యాడర్ ని రెచ్చకొట్టేలా సోషల్ మీడియాలో జెండా కూలీలు అంటూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ శ్రేణులు.
ఇక 2024 ఎన్నికలలో జనసేన కు మూకుమ్మడి మద్దతు ప్రకటించిన, కూటమికి కాపు కాసిన కాపు సామాజికవర్గ నేతలను పక్కన పెట్టేసి టీడీపీ పార్టీని కొమ్ము కాసే కమ్మ సామాజికవర్గానికి పవన్ ఊడిగం చేస్తున్నారు, ఇక తన నిర్ణయాలతో పార్టీ క్యాడర్ ని టీడీపీ కి బానిసలుగా మారుస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో జనసేన మీద విష ప్రచారం మొదలుపెట్టింది.
జనసేన టార్గెట్ గా కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టేందుకు సిద్దమైన వైసీపీ ఇటు టీడీపీ విషయానికొస్తే రెడ్డి సామాజికవర్గం పై సానుభూతి కలిగేలా రాజకీయం షురూ చేసింది. టీడీపీ పార్టీకి దక్కిన మూడు రాజ్యసభ సీట్లకు గాను బాబు ఒకటి చింతకాయల విజయ్ కు కేటాయించగా మిగిలిన రెండు సాన సతీష్, భాష్యం రామకృష్ణ కు కేటాయించారు.
అయితే ఇందులో చింతకాయల విజయ్ బీసీ సామాజికవర్గానికి చెందగా, సాన సతీష్ కాపు, భాష్యం రామకృష్ణ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు. ఇందులో టీడీపీ కడప ఇంచార్జ్ గా ఉన్న శ్రీనివాస రెడ్డి రెడ్డప్ప తానూ కడప వంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో టీడీపీ బలోపేతానికి గత దశాబ్దంగా పనిచేస్తున్నానని,
పార్టీ కోసం శ్రమించిన తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తానంటూ గతంలో పార్టీ అధిష్టానం తనకు మాట ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేదంటూ తన X లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక దొరికిందే సందు అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు ఇక్కడ రెడ్డి గారికి బాబు ద్రోహం అంటూ సోషల్ మీడియాలో బాబు వెన్నుపోటు అంటూ పోస్ట్లు పెడుతున్నారు.
కమ్మవారికి జనసేన రాజ్యసభ సీటు కేటాయించడం కాపు వారికీ పవన్ చేసిన ద్రోహంగా అభివర్ణిస్తున్న వైసీపీ, రెడ్డి గారికి టీడీపీ సీటు కేటాయించకపోవడం బాబు చేసిన మోసంగా చిత్రీకరిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రాజ్యసభ సీట్లన్నీ రెడ్డి సామాజికవర్గ నేతలకే కేటాయించేవారు.
2014 నుంచి 2024 వరకు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల చిట్టా గమనిస్తే అందులో విజయ్ సాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘనాధ రెడ్డి …ఇలా సింహ భాగం సీట్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకే దక్కేవి. మరి ఇక్కడ వైసీపీ లో దీన్ని రెడ్డి ప్రాతినిధ్యం అంటారా.? లేదా రెడ్డి ప్రాధాన్యం అంటారా.?
నాడు వైసీపీ పార్టీ కోసం తన సామాజికవర్గ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అడుగులు వేసిన కాపు నేత ముద్రగడ కు జగన్ తన పార్టీలో ఏ పదవి ఇచ్చి గౌరవించారో సగర్వంగా చెప్పగలరా.? ఇప్పుడొచ్చి జనసేన కాపు ద్రోహి, టీడీపీ రెడ్డి ద్రోహి అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తే అదే సోషల్ మీడియా వైసీపీ గత చరిత్రను కూడా బయటకు తీయగలదు అని గ్రహించాలి.




