వైసీపీ అధినేత జగన్తో సహా ఆ పార్టీలో పలువురు అన్య మతస్తులున్నారు. కనుక వారికి తిరుమల, స్వామివారు, ప్రసాదం విషయంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. అలాగే భక్తుల మనోభావాలను కూడా వారు పట్టించుకోకపోవచ్చు.
కానీ అదే వైసీపీలో స్వామివారి పట్ల భక్తి, నమ్మకం కలిగినవారు అనేకమంది ఉన్నారు. కానీ వారు కూడా హిందువుల, ముఖ్యంగా తిరుమల శ్రీవారి మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరిస్తుండటం చాలా శోచనీయం. అన్య మతస్తుడైన తమ అధినేత సంతృప్తి కోసం దేవాలయాలలో ప్రాయశ్చిత్త పూజలు, హోమాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.
తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసి, తిరుమల ప్రతిష్ట దిగజార్చినందుకు, స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బ తీసినందుకు ‘ప్రాయశ్చిత్తం’ అంటూ పలువురు వైసీపీ నేతలు దేవాలయాలలో పూజల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.
తాజాగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, 27 మంది అనుచరులు కలిసి డిసెంబర్ 31న వినుకొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హడావుడి చేశారు.
ఆలయంలో, పరిసరాలలో రాజకీయ నినాదాలు చేయరాదని పోలీసులు హెచ్చరిస్తున్నా వారు వినకుండా ‘జై జగన్’ అని పెద్దగా నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని దుర్భాషలాడుతూ పక్కకు తోసేశారు. కానిస్టేబుల్ పిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
సిఎం చంద్రబాబు నాయుడు లేదా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేదా ఎవరూ కూడా ఎన్నడూ ఇతర మతాలను గౌరవిస్తారే తప్ప వాటి వ్యవహారాలలో ఈవిధంగా జోక్యం చేసుకోరు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హిందూమతంపై కక్ష కట్టినట్లు అనేక అపచారాలు చేసింది.
అధికారం కోల్పోయినా హిందూమతంతో ఈవిధంగా ఆడుకుంటూనే ఉంది. సనాతన ధర్మం కాపాడుతానని చెప్పుకునే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కానీ, హిందూమతానికి పేటెంట్ హక్కులు తీసుకున్నట్లు మాట్లాడే బిజేపి కానీ తగు రీతిలో స్పందించడం లేదు.
ప్రజల మద్య మత చిచ్చురగిలించేందుకు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెపుతున్నారు. కానీ చట్టప్రకారం కటిన చర్యలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుంటే, అక్కడ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినందున రాష్ట్రపతి పాలన విధించాలని’ డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వెలుపల ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తున్నారు!దీనిని బట్టి వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని అర్ధమవుతోంది కదా?
హిందూ దేవాలయాలను, పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదం, పరకామణితో, ఇప్పుడు రాష్ట్రంలో దేవాలయాలలో ప్రాయశ్చిత్తం పేరుతో వైసీపీ పరాచికాలు ఆడుతూ ఈవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తుంటే కూటమి ప్రభుత్వ స్పందన ఏవిధంగా ఉండాలి? కానీ ఏవిధంగా ఉంది? ఎందువల్ల?
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని YSRCP డిమాండ్ pic.twitter.com/crazCXMiVK
— M9 NEWS (@M9News_) February 3, 2026






