అందరూ గర్జించారు ఓకే… కానీ అసలు విషయం చెప్పరే!

Visakha-Garjanaవిశాఖను రాజధాని చేయాలని ‘నాన్-పోలిటికల్ జేయేసీ’ ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జనసమీకరణ చేసి ఈరోజు విశాఖలో ర్యాలీ చేసి గర్జించారు. ఓకే. అయితే విశాఖకు సుదూరంగా ఉన్న చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ మంత్రులు, నేతలు విశాఖను రాజధాని డిమాండ్ చేయాలని డిమాండ్ చేయడమే విడ్డూరంగా ఉంది. దానికి వారు మూడు రాజధానులు-వికేంద్రీకరణ అనే మరో ముసుగు వేసినప్పటికీ, మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసింది వారి ప్రభుత్వమే కానీ ప్రజలు, ప్రతిపక్షాలు కాదు కదా?మరెందుకీ గర్జనలు… గాండ్రింపులు?

విశాఖ రాజధానిగా వద్దనే వారిని జిల్లా నుంచి తరిమికొట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. అదేవిదంగా… అమరావతిని రాజధాని వద్దనే మంత్రులను, ఎమ్మెల్యేలను, వైసీపీ నేతలను కూడా అక్కడి ప్రజలు తరిమికొట్టాలని టిడిపి లేదా మరో పార్టీ పిలుపునిస్తే వారి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకొన్నారా?

ADVERTISEMENT

రాష్ట్రాన్ని పాలించమని వైసీపీకి ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే ప్రజల మద్య ఈవిదంగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తుండటం చాలా శోచనీయం. ఇప్పటికే ఆంద్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ పనితో మళ్ళీ జిల్లాలవారీగా విడిపోయే దుస్థితి ఏర్పడుతుంది.

అరసవిల్లికి పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులు ఈరోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో చాగల్లు సెంటరుకి చేరుకొన్నప్పుడు వారికి స్థానిక ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతుంటే, వైసీపీ కార్యకర్తలు రైతులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు చేతపట్టుకొని నిరసనలు తెలిపారు.

ఒకవేళ వారు తమ కార్యకర్తలుకారు స్థానిక ప్రజలే అని వైసీపీ చెప్పదలచుకొంటే మూడు రాజధానులతో ప్రజల మద్య ఏవిదంగా చిచ్చుపెడుతోందో అర్దమవుతుంది. ఒకవేళ నిరసనలు తెలిపినవారు తమ పార్టీ కార్యకర్తలే అని అంగీకరిస్తే, తమ పార్టీ నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని రాష్ట్రంలో ప్రజలెవరూ వ్యతిరేకించడానికి వీలులేదని, ‘తన మాటే శాసనం’ అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశపాలన చేస్తున్నట్లు అంగీకరించవలసి ఉంటుంది.

చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖకు వచ్చి లక్షమందితో ర్యాలీ నిర్వహించి తమ వాదనను వినిపించడం తప్పు కాదనుకొంటే, కేవలం 600 మంది రైతులు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుకోవడం… దాని కోసం అరసవిల్లికి పాదయాత్ర చేస్తుండటం తప్పు ఎలా అవుతుంది? అసలు వారిని అడ్డుకొనే హక్కు మంత్రులు, ఎమ్మెల్యేలకు, వైసీపీ కార్యకర్తలకు ఎవరిచ్చారు?

ఉత్తరాంద్ర జిల్లాలలో టిడిపిని రాజకీయంగా దెబ్బతీయాలనే దురాలోచనతో వైసీపీ ఈసాకుతో ప్రజల మద్య చిచ్చుపెడుతోందని ప్రజలు గ్రహించి ఈ ఉచ్చులో చిక్కుకుండా దూరంగా ఉండగలిగితే టిడిపి, వైసీపీలే అమీతుమీ తేల్చుకొంటాయి కదా?

ADVERTISEMENT
Latest Stories