రాజకీయ పార్టీలు అదృష్టం కలిసివస్తే అధికారంలోకి రాగలవు. కానీ వాటి అధినేతల ఆలోచనా ధోరణిలో లోపాలున్నట్లయితే పతనం తప్పదని గ్రహించేందుకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు కళ్ళెదుటే ఉన్నాయి.
ఏపీలో టీడీపి, జనసేన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయాయిగా? అనే సందేహం కలుగవచ్చు. వాటి ఓటమికీ అదే కారణం. కానీ లోపాలు గుర్తించి, అంగీకరించి, సరిదిద్దుకొని ముందుకు సాగాయి. కనుక ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి.
తెలంగాణ ఇచ్చినందుకు మొట్ట మొదట కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారనుకుంటే, ఆ పార్టీ నేతలు టికెట్స్, సీట్లు, పదవుల కోసం పరస్పరం కీచులాడుకుంటుంటే కేసీఆర్ తెలివిగా అవకాశాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. ఆయన రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ, అయన అహంభావం, నిరంకుశ వైఖరి, ఏకపక్ష నిర్ణయాలే ఆ పార్టీకి శాపంగా మారాయి.
అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి పరస్పరం కీచులాడుకుంటూ, తన నాయకత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలందరినీ కలిసి పోరాడితేనే పదవి అధికారం లేకుంటే ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోతామని నచ్చజెప్పి ఒక్క తాటిపైకి తెచ్చారు.
కనుక బీఆర్ఎస్ పార్టీ అధినేత లోపాలు సవరించుకోవడానికి ఇష్టపడక నష్టపోతే, కాంగ్రెస్ పార్టీలో లోపాన్ని సరిచేసి ముందుకు నడిపించే సరైన నాయకుడు దొరికినందున కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఇదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ, కొన్ని తప్పుడు నిర్ణయాలు, రాజకీయ సమీకరణాలలో మార్పుల వలన టీడీపి ఓడిపోయింది.
అదే సమయంలో వైఎస్సార్ కుమారుడుగా ప్రజల ముందుకు వచ్చిన జగన్కి అన్నీ అనుకూలించడంతో ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ అసూయ, ద్వేషం, అవినీతి, రాజకీయ లాలస, అహంభావం వంటి అవలక్షణాలు, అనేక తప్పుడు నిర్ణయాల వలన ఓడిపోయారు.
చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ గెలిచారు. ఇద్దరూ ఓడిపోయారు. కానీ వారిలో చంద్రబాబు నాయుడు జరిగిన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి రాగా, జగన్ మాత్రం తప్పులను కొనసాగిస్తూ అదే సరైన పద్ధతని, ఈవిధంగానే అధికారంలోకి రాగలమని గట్టిగా నమ్ముతూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, పార్టీ పేరు మార్పు తప్పని అంగీకరించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, కేసీఆర్ నలుగురూ గొప్ప సిఎంలని మెచ్చుకున్నారు. అలాగే తెలంగాణలోకి ఇతర పార్టీలు రాకూడదనే తమ ఆలోచన కూడా తప్పని అంగీకరించారు.
అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తన తప్పులను అంగీకరించి సరిదిద్దుకునేందుకు సిద్దపడుతోందన్న మాట! కానీ నేటికీ కేటీఆర్లో అహంభావం, నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు. అవి కూడా తగ్గించుకోగలిగితే ప్రజలు తప్పకుండా ఆదరించి అధికారం కట్టబెడతారని ఇప్పటికే నిరూపించబడింది.
కానీ ఒక పార్టీ వైఖరిలో ఇలాంటి సానుకూల మార్పు వచ్చినప్పటికీ, ప్రత్యర్ధి పార్టీ కూడా తప్పులు చేస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనితీరు మెరుగుపడి, అదే సమయానికి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పుంజుకొని, బిజేపి మళ్ళీ చక్రం తిప్పితే వచ్చే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పదు.
కానీ జగన్తో పోలిస్తే కేటీఆర్ సరైన దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టారు. కనుక కాస్త ఆలస్యంగానైనా తప్పకుండా గమ్యం చేరే అవకాశం ఉంటుంది.
ఏపీలో టీడీపిని, కూటమి పార్టీలను సిఎం చంద్రబాబు నాయుడు సరైన దిశలో నడిపిస్తూ, ఒకవేళ పక్కదారి పడితే వెంటనే సరిచేస్తున్నారు.
కానీ జగన్ స్వయంగా తప్పులు చేస్తూ పార్టీలో అందరితో ఆ తప్పులు అమలుచేయిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పార్టీలో ‘రప్పారప్పా సంస్కృతి’ని ప్రోత్సహించడం, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటూ రాజకీయాలు చేస్తుండటం వంటివి వైసీపీకి శాపాలుగా మారే అవకాశం ఉంది.




