మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు నారా లోకేష్, పార్ధసారధి నీళ్ళు నమిలారని వైసీపీ సొంత మీడియా తేల్చి పడేసింది. బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే సభలో ఉన్న మంత్రులు, టీడీపి సభ్యులు గడగడ వణికిపోయారట! సొంత మీడియా ఉన్న పార్టీలకు ఇలా వ్రాసుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ రాతలను తప్పు పట్టలేము.
మండలిలో వైసీపీ నేతలని చూసే మంత్రులు భయంతో గజగజ వణికిపోతున్నప్పుడు, లేదా వారిని వణికించేయగలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నప్పుడు, జగన్ తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని వచ్చి శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుని కూడా అలాగే గడగడలాడించేయోచ్చు కదా?
మండలిలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని దడదడలాడించేస్తున్నప్పుడు, శాసనసభలో కూడా ఆడించేయొచ్చు కదా?
మరో మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఎలాగూ 175/175తోనే అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకం ఉంది. కనుక టీమ్ 11 కెప్టెన్ జగన్ ఈ అవకాశం మాత్రం వదులుకోవడం దేనికి? శాసనసభలో కూడా రాప్పారప్పా అంటూ దడదడ లాడించేస్తే అప్పుడు కూటమి నాయకులే సభ నుంచి వాకవుట్ చేసి పారిపోయేలా చేయోచ్చు కదా?
కానీ జగన్ చాలా మంచివారు కనుక వద్దనుకున్నారు. దాంతో కూటమి నేతలందరూ బ్రతికిపోయారు. లేకుంటేనా!






