వైసీపీ హయంలో రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ గురించి శాసనసభలో మాట్లాడేవారు. సోషల్ మీడియాలో బూతులు వినిపించేవి. మంత్రులు రోడ్లపై డాన్సులు చేసేవారు. చొక్కాలు చించుకునేవారు. రాజధానికి భూములిచ్చిన మహిళా రైతులపై దాడులు జరిగేవి.
అవన్నీ ఓ పీడకలగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోదామని ప్రయత్నిస్తున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ అంటూ భయపెడుతూనే ఉన్నారు. మరో మూడేళ్ళ తర్వాత మళ్ళీ మా ‘స్వర్ణయుగం’ తప్పక వస్తుందని వారి అధినేత జగన్ భరోసా ఇస్తున్నారు.
ప్రతిపక్ష నేతలకు, చివరికి వారి కార్యకర్తలకు కూడా ఇంత స్పిరిట్ ఉంది. కానీ ఈ టీడీపి, జనసేన మంత్రులలో ఒక్కరికీ ఆ స్పిరిట్ లేదు. అలాంటి టాలెంట్ కూడా లేదు పాపం!
ఓ మంత్రి పచ్చ చొక్కా తొడుక్కొని సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంటారు. మరొకరు మారుమూల గ్రామాలకు రోడ్లు అంటూ తిరుగుతుంటారు. మరొకరు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు అంటూ ఒకటే పలవరింతలు… అలా దావోస్ వరకు వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన చంద్రబాబు నాయుడు కూడా చలీ గిలీ, కోడీ గుడ్డూ, ఆమ్లెట్ అని అడగకుండా అక్కడే ఆ చలిలో తిరుగుతున్నారు.
ఇలా ఒక్కో మంత్రి ఏదో పని పట్టుకు వ్రేలాడుతుంటారే తప్ప జనాలకు ఉల్లాసం కలిగించే నాలుగు ముక్కలు మాట్లాడరు. అందరూ రాజకీయ నాయకులమని కాలర్ ఎగరేసుకొని తిరిగేవారే… కాస్త రాజకీయాలు కూడా చేయాలని తెలీదు. ఎలా నెగ్గుకొస్తారో ఏమో పాపం!
పోలీసులకు బాస్ మంత్రి అంటే ఎలా ఉండాలి?అందరూ భయంతో గజగజ వణికిపోవాలి. కానీ ఈ అనిత వంగలపూడికి ఆ డాబు, దర్పం మెయిన్టెయిన్ చేయడం బొత్తిగా రాదు.
మొన్నెప్పుడో తూర్పు గోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన లేడీ కానిస్టేబుల్ జయశాంతి డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆమె పోలీస్ కనుక హారన్ కొట్టాలి కానీ బండి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసింది… అదీ చేతిలో చంటిపిల్లాడిని ఎత్తుకొని!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి హోంమంత్రి అనితమ్మ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ లేడీ కానిస్టేబుల్ దంపతులను ఇంటికి ఆహ్వానించి ఇద్దరికీ బట్టలు పెట్టి అభినందించారు.
కాదేది కవితకు అనర్హం అన్నట్లు వైసీపీ స్వర్ణయుగంలో కోడిగుడ్డు, చిక్కీ, స్కూలు బ్యాగు, సర్వేరాళ్ళ వరకు ప్రతీచోట జగన్ ఫోటోలు చూశాము కానీ ఓ లేడీ కానిస్టేబుల్కి హోంమంత్రి బొట్టు పెట్టి బట్టలు పెట్టిన ఫోటో ఎన్నడైనా చూశామా? లేదు ఎందుకంటే మన స్వర్ణయుగమే చాలా డిఫరెంట్ కనుక!






