బుదవారం సాయంత్రం కందుకూరు పట్టణంలో జరిగిన త్రొక్కిసలాటలో మరణించినవారి ఇళ్ళకు వెళ్ళి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన సభకి వచ్చిన వారు ఈవిదంగా మృత్యువాతపడటం చాలా బాధాకరమని, ఇది తనను ఎంతో కలచివేస్తోందన్నారు. నా మీద, టిడిపి మీద ఎంతో అభిమానంతోనే వారు వచ్చారని కనుక వారి కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. వారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని, పిల్లల చదువులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయిస్తానని చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రులు తనపై చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “నిన్న నేను రోడ్ షో మొదలుపెట్టిన్నప్పటికే వేలాదిమంది నాతో ఉన్నారు. మేము ఎన్టీఆర్ సర్కిల్ వద్దకి చేరుకొనేసరికే అక్కడ వేలాదిమంది ఎదురుచూస్తున్నారు. దాంతో జనం కిక్కిరిసిపోయి త్రోపులాట జరిగి ఈ విషాదం చోటు చేసుకొంది.
నేను కందుకూరులో రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు ఎన్ని వేలమంది ఉన్నారో అన్ని టీవీ న్యూస్ ఛానల్సులో వచ్చాయి. కనుక ఇరుకు వీధుల్లో ప్రవేశించి లేని జనం ఉన్నట్లు చూపుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. కానీ నేనేదో లేని జనం ఉన్నట్లు చూపుకోవడానికి ఇరుకు సందుల్లో రోడ్ షో నిర్వహించానని, అందుకే త్రొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు. అయినా నన్ను నిందిస్తున్నారు. ఇక వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
అసలు నేను పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ముందుకు కదలక మునుపే త్రొక్కిసలాట మొదలైంది. అయితే ఆ సమయంలో జనాలని అదుపు చేసేందుకు తగినంత మంది పోలీసులు లేకపోవడంతో ఈ విషాదం జరిగింది. అప్పటికీ… టిడిపి కార్యకర్తలు చొరవ తీసుకొని జనాలని అదుపు చేస్తూ క్షతగాత్రులని వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు చేసినప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పోలీసులను, ఉన్నతాధికారులను దింపి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనలలో మొక్కుబడిగా పోలీసులను ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంటుంది ప్రభుత్వం. ఇది ప్రతీ సభ, ర్యాలీలోని స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే అదృష్టవశాత్తు ఇదివరకు ఎన్నడూ ఇటువంటి విషాదం జరుగలేదు. తొలిసారిగా నిన్న కందుకూరులోనే జరిగింది.
దీనికి చంద్రబాబు నాయుడే పూర్తి బాధ్యుడని కనుక పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి దానిలో ఆయనని ఏ-1గా పేర్కొనాలని మంత్రి రోజా అనడం అత్యుత్సాహం ప్రదర్శించడమే. అక్రమాస్తుల కేసులలో తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు నిత్యం ఏ-1 అని సంభోదిస్తుంటాయి కనుకనే చంద్రబాబు నాయుడుని కూడా ఏ-1 చేయాలని రోజా ఆతృతపడుతున్నట్లు అర్దమవుతోంది.
అయితే తన సభలో ఈవిదంగా జరగాలని ఏ నాయకుడు కోరుకోడు. కానీ రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడిదే తప్పని తీర్మానించేశారు.
శాంతి భద్రతల పేరుతో ఎన్నిసార్లు ప్రతిపక్ష నేతల ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారో అందరికీ తెలుసు. అంటే ఇటువంటి విషాద ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత జిల్లా పోలీసులకు ఉందని అర్దమవుతోంది. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉండి ఉంటే ఈ విషాద ఘటన జరిగేదే కాదు కదా?కానీ జరిగిన తర్వాత అందరూ చేతులు దులుపుకొని చంద్రబాబు నాయుడిదే తప్పు అని తీర్మానించేస్తున్నారు?అయినా చనిపోయిన వారి గురించి ఆలోచించకుండా ఇప్పుడూ వైసీపీ నేతలు ఈవిదంగా మాట్లాడుతూ శవరాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం.



