సకల జీవులకు చావుపుట్టుకలు అనివార్యం. కొందరు మనుషులకి, జీవులకి పుట్టుకతోనే నరకం మొదలవుతుంది. మరికొందరికి చావు చాలా భయంకరంగా మారుతుంది. ఇలాంటి చావు పగవాడికి కూడా వద్దనుకునే చావు సహారా ఎడారిలో సంభవించింది.
పశ్చిమాఫ్రికా దేశంలోని నైజర్లో బక్రీద్ పండుగ జరుపుకొని మాలీకి తిరిగివస్తున్న 49 మంది సహారా ఎడారిలో తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు లేక ఆకలిదప్పులతో చనిపోయిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారందరూ ఓ ట్రక్కులో నైజర్ నుంచి ఎడారి మార్గం గుండా మాలీకి బయలుదేరారు. దారిలో ట్రక్ చెడిపోయింది.
ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో సహాయం పొందలేకపోయారు. కనుక నడిచి వెళ్దామా అంటే దగ్గరలో ఉన్న అస్సామాకా పట్టణం అక్కడి నుంచి 80 కిమీ దూరంలో ఉంది.
ఆ ఎడారిలో 45-50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. కనుక అడుగు బయటపెడితే దారిలో చనిపోవడం ఖాయం. కనుక అందరూ ట్రక్కులోనే ఉండిపోయారు.
కానీ వారిలో ఒకే ఒక్క వ్యక్తి ధైర్యం చేసి అతికష్టం మీద 50 కిమీ నడిస్తే అక్కడ నీళ్ళు దొరికాయి. దొరక్కపోయి ఉంటే అక్కడే చనిపోయేవాడు.
అక్కడి నుంచి మరో 30 కిమీ నడుచుకుంటూ ఎట్టకేలకు అస్సామాకా పట్టణం చేరుకొని ఎడారిలో చిక్కుకుపోయిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్న్నారు. కానీ అక్కడ ఆకలిదప్పులతో చనిపోయినవారి శవాలు కనిపించాయి. ఇంతకంటే దారుణమైన చావు ఉంటుందా?
వారందరినీ అక్కడే పూడ్చిపెట్టి తిరిగి వస్తుంటే వారికి దూరంగా మరో ట్రక్ కనిపించింది. వెళ్ళి చూస్తే దానిలో 60 మంది ఆకలిదప్పులతో అలమటిస్తూ కనిపించారు. పోలీసులు, సహాయ సిబ్బంది వారందరికీ మంచినీళ్ళు, ఆహరం అందించి అస్సామాకా పట్టణానికి తరలించారు. ఒకవేళ వారిని పోలీసులు చూడకపోయి ఉంటే?




