తొమ్మిది రోజులు గడిచినప్పటికీ పరిస్థితిలో మార్పు రాక, బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు గంటల తరబడి ప్రజలు క్యూలలో నిల్చుంటున్నా… కేవలం 4500 రూపాయలు మాత్రమే చేతికందుతోంది. అయితే, తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మరింత దుర్భరం కానుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకు పాత నోట్లను 4500 రూపాయల మేరకే మార్పిడి చేస్తుండగా, తాజాగా ఆ మొత్తాన్ని 2000 రూపాయలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కుదించింది.
ఈ దిశగా ఆర్ధిక కార్యదర్శి శశికాంత్ దాస్ ఓ అధికారిక ప్రకటన చేసారు. ఈ మార్పు శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని, నోట్ల కొరత ఉన్నందు వలనే ఈ తగ్గింపు చర్య అని ప్రకటించారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, అప్పుడు తిరిగి మొత్తాన్ని పెంచుతామని, అప్పటివరకు ప్రజలు సహకరించాలని కోరారు. అయితే ఈ నిర్ణయం మార్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. నోట్ల కొరత ఉందన్న మాట వాస్తవమే గానీ, ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఎందుకు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారన్న వాదన మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
అందులోనూ 100 నోట్లు లేకపోవడం పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేస్తోంది. పాత నోట్లను మార్పు చేసే క్రమంలో బ్యాంకు అధికారులు కేవలం 2000 నోట్లను ఇస్తుండడంతో బయట 100 రూపాయల నోట్లు లభ్యం కాక మరో ఇబ్బంది పడుతున్న వైనం వర్ణణాతీతం. 500 నోట్లను విడుదల చేసినప్పటికీ, అవి మార్కెట్ లోకి విరివిగా రాలేదు. ఓ పక్కన చేతిలో, మరో పక్కన బ్యాంకు ఖాతాలలో డబ్బులు ఉన్నా… ఏమీ చేయలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. కొంతలో కొంత ఊరట చెందే విషయం ఏమిటంటే… పెళ్లి ఖర్చుల నిమిత్తం వివాహ శుభలేఖలను చూపిస్తూ 2.50 లక్షలను విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించిన నిర్ణయం ఊరట కలిగించింది.



