మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగి ఇద్దరూ క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో పెద్దిరెడ్డి చేస్తున్న సంక్షేమ పధకాలని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఆయనని అంతమొందించేందుకు ఈ కుట్రకు పాల్పడిఉండవచ్చని అడపా శేషు అనుమానం వ్యక్తం చేశారు.
కనుక ఈ ప్రమాదాన్ని ఓ కుట్రగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డిని, మిధున్ రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తే రేపు మీకూ ఆదేగతి పడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే పుంగనూరులో పోటీ చేసి పెద్దిరెడ్డిపై గెలవాలని అడపా శేషు సవాల్ విసిరారు.
ఇదివరకు ఓ వైసీపీ ముఖ్య నేత మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు కావాలనుకొంటే చంద్రబాబు నాయుడుని ఆయన ఇంట్లోనే చంపించేసి ఉండేవారిమి. ఒకవేళ మేము టార్గెట్ చేయాలనుకొంటే మా తొలి టార్గెట్ నారా లోకేష్ అవుతాడు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని రైతులు గుడివాడ గుండా పాదయాత్ర చేస్తున్నప్పుడు, సిఎం జగన్, కొడాలి నాని ఫోటోలతో వేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో “మా జోలికి వస్తే తలకాయలు లేపేస్తాం,” అంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అడపా శేషు కూడా చంద్రబాబు నాయుడుకి అదే గతి పడుతుందని హెచ్చరించడం చూస్తే హత్యా రాజకీయాలు ఏ పార్టీకి అలవాటో అర్దం అవుతోంది.
అయినా ఓ కారు ప్రమాదాన్ని కుట్రగా పరిగణించి విచారణ జరిపించాలని వైసీపీ నేత డిమాండ్ చేయడం చూస్తుంటే, ఎటువంటి సమస్యనైనా చంద్రబాబు నాయుడు మెడకి చుట్టగలరని చెప్పకనే చెపుతున్నారు కదా?



